Nara Lokesh: లోకేశ్ యువగళం పాదయాత్రపై మరిన్ని వివరాలు కోరిన డీజీపీ కార్యాలయం

DGP office seeks more details on Nara Lokesh Yuvagalam Padayatra
  • ఈ నెల 27 నుంచి లోకేశ్ పాదయాత్ర
  • పోలీసు శాఖ అనుమతి కోరుతూ టీడీపీ లేఖ
  • ఇటీవల రిమైండర్ కూడా పంపిన వర్ల రామయ్య
  • తాజాగా ప్రత్యుత్తరం ఇచ్చిన డీజీపీ కార్యాలయం 
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జనవరి 27 నుంచి సుదీర్ఘ పాదయాత్ర చేపడుతుండడం తెలిసిందే. ఆ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలంటూ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఈ నెల 9న డీజీపీకి లేఖ రాశారు. పోలీసు శాఖ నుంచి అనుమతి రాకపోవడంతో, రిమైండర్ లేఖను కూడా పంపారు. ఈ నేపథ్యంలో, ఏపీ పోలీస్ విభాగం స్పందించింది. లోకేశ్ పాదయాత్రకు సంబంధించి మరిన్ని వివరాలు అందజేయాలని డీజీపీ కార్యాలయం టీడీపీని కోరింది.

  • లోకేశ్ పాదయాత్ర ఏ జిల్లాలో ఎప్పుడు, ఎక్కడ కొనసాగుతుందో సమయం, ప్రాంతం, తేదీలతో కూడిన పూర్తి షెడ్యూల్ సమర్పించాలి.
  • జిల్లాల్లో లోకేశ్ పాదయాత్ర సాగే సమగ్ర రూట్ మ్యాప్ ఇవ్వాలి.
  • పాదయాత్రలో ఎంతమంది పాల్గొంటారు? వారందరి వివరాలు అందజేయాలి.
  • పాదయాత్రలో ఏ ఏ రకం వాహనాలు వినియోగిస్తారు? వాటి నెంబర్లు, నెంబర్ ప్లేట్ వివరాలు, ఇతర అంశాలను సమర్పించాలి.
  • పాదయాత్రలో రాత్రి బస చేసే ప్రాంతాల పేర్లు, జిల్లాల వారీగా స్థానిక ఫోన్ నెంబర్లు ఇవ్వాలి.

ఈ వివరాలను రేపు (జనవరి 22) ఉదయం 11 గంటలకు డీజీపీ కార్యాలయంలో వ్యక్తిగతంగా హాజరై కానీ, లిఖితపూర్వకంగా కానీ అందించవచ్చని పోలీసు శాఖ టీడీపీకి పంపిన ప్రత్యుత్తరంలో స్పష్టం చేసింది.

Nara Lokesh
Yuva Galam
Padayatra
TDP
DGP
Andhra Pradesh

More Telugu News