రాహుల్ గాంధీని ఆదిశంకరాచార్యులతో పోల్చిన ఫరూక్ అబ్దుల్లా.. మండిపడిన బీజేపీ

  • కశ్మీర్ చేరుకున్న రాహుల్ భారత్ జోడో యాత్ర
  • ఆదిశంకరాచార్యుల తర్వాత ఆ ఘనత సాధించింది రాహులేనన్న ఫరూక్ 
  • రాహుల్ యాత్రను వ్యతిరేకించేవారు మానవాళికి శత్రువులని వ్యాఖ్య  
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా.. ఆదిశంకరాచార్యులతో పోల్చారు. జమ్మూకశ్మీర్‌లోని లఖన్‌పూర్‌లో ఈ నెల 19న జరిగిన బహిరంగ సభలో ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన మొదటి వ్యక్తి ఆదిశంకరాచార్యులేనని, ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ రాహుల్ మాత్రమే ఆ పనిచేశారని కొనియాడారు. భారత్ జోడో యాత్ర లక్ష్యం దేశాన్ని ఏకం చేయడమేనన్న ఆయన.. ఈ యాత్రను వ్యతిరేకించే వారంతా దేశానికి, మానవాళికి శత్రువులని అన్నారు.

ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ‘హిందూ ఉగ్రవాదం’, ‘కాషాయ ఉగ్రవాదం’ పదాల సృష్టికర్త అయిన రాహుల్‌ను శంకరాచార్యులతో పోల్చడం తగదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి హెహజాద్ పూనావాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, భారత్ జోడో యాత్ర కశ్మీర్ చేరుకోవడంపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. చాలా ఆనందంగా ఉందని, సొంతింటికి వచ్చిన భావన కలుగుతోందని అన్నారు. తన మూలాలు ఇక్కడే ఉన్నాయని ట్వీట్ చేశారు.


More Telugu News

Rahul Gandhi Bharat Jodo Yatra Congress NCP Adi Shankaracharya