death risk: కరోనా తర్వాత 18 నెలల వరకు మరణం ముప్పు

  • ఇన్ఫెక్షన్ కు గురి కాని వారితో పోలిస్తే ఎన్నో రెట్లు అధికం
  • దీర్ఘకాలంలో గుండె జబ్బులు, డీప్ వీన్ థ్రోంబోసిస్ సమస్యలు
  • కరోనా వచ్చిన మూడు వారాల్లో ముప్పు అధికం అంటున్న కొత్త అధ్యయనం
Covid patients at high death risk for at least 18 months from infection warn researchers

కరోనా మహమ్మారి గురించి శాస్త్రవేత్తలు ముఖ్యమైన హెచ్చరిక చేస్తున్నారు. కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడి రికవరీ అయిన వారు ఏడాదిన్నర పాటు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ వైరస్ బారిన పడిన తర్వాత 18 నెలల వరకు మరణించే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడని వారితో పోలిస్తే, ఇన్ఫెక్షన్ కు గురైన వారు పలు గుండె సమస్యలు ఎదుర్కొంటున్నట్టు చెబుతున్నారు. ఇది మరణానికి దారితీయవచ్చని సందేహం వ్యక్తం చేస్తున్నారు.

యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీకి చెందిన కార్డియో వాస్క్యులర్ రీసెర్చ్ అనే జర్నల్ లో ఈ అధ్యయన ఫలితాలు నమోదయ్యాయి. శాస్త్రవేత్తలు 1,60,000 మందిపై పరిశోధన చేశారు. కరోనా బారిన పడి కోలుకుంటున్న వారిని ముఖ్యంగా ఏడాది పాటు అయినా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలని వీరు సూచిస్తున్నారు. ఆ కాలంలో గుండె సంబంధిత సమస్యలు బయటపడతాయని చెబుతున్నారు.

ముఖ్యంగా కరోనా ఇన్ఫెక్షన్ కు గురైన తర్వాత మొదటి మూడు వారాల్లో మరణించే ముప్పు 81 రెట్లు అధికమని, ఆ తర్వాత 18 నెలల కాలంలో మరణ రిస్క్ ఐదు రెట్లు అధికంగా ఉంటుందని వీరు అంటున్నారు. కరోనా ఇన్ఫెక్షన్ కు లోనై, తీవ్ర దశలో ఉంటే గుండె జబ్బులు ఏర్పడే ప్రమాదం నాలుగు రెట్లు అధికంగా ఉంటుంది. వ్యాధి తీవ్రత తగ్గిన తర్వాత దశలో 40 శాతం గుండె జబ్బులు ఏర్పడే రిస్క్ ఉంటుంది. మొత్తానికి దీర్ఘకాలంలో మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్, కరోనరీ హార్ట్ డిసీజ్, హార్ట్ ఫెయిల్యూర్, డీప్ వీన్ థ్రోంబోసిస్ ఏర్పడే ప్రమాదం ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు.

More Telugu News