Savitri: సావిత్రి గురించి ఆమె మేనల్లుడు ఏమన్నాడంటే ..!

  • తొలిసారిగా ఇంటర్వ్యూ ఇచ్చిన సావిత్రి మేనల్లుడు 
  • సావిత్రి గృహప్రవేశం గురించిన ప్రస్తావన 
  • ఇండస్ట్రీ నుంచి ఆ ఫంక్షన్ కి రానివారు లేరని వ్యాఖ్య
  • సింపుల్ గా ఉన్నప్పటికీ రాజసం కనిపించేదని వెల్లడి  
Vijaya Chamundeshwary Interview

మహానటి సావిత్రి తన కూతురు విజయ చాముండేశ్వరిని తన మేనల్లుడైన గోవిందరావుకి ఇచ్చి వివాహం చేశారు. అయితే ఆయన బయట వేదికలపై .. ఇంటర్వ్యూలలోను కనిపించేవారు కాదు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. "నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి సావిత్రిగారు తెలుసు. 1957లో సావిత్రిగారు మద్రాసులో సొంతంగా ఇల్లు కట్టారు. ఆమె కోరిక మేరకు నాగిరెడ్డిగారు దగ్గరుండి మరీ ఆ ఇంటి నిర్మాణాన్ని పూర్తిచేయించారు" అన్నారు. 

"ఆ ఇంటి గృహప్రవేశానికి నేను నెల్లూరు నుంచి వెళ్లాను. ఆ వేడుకకు తెలుగు .. తమిళ ఇండస్ట్రీ నుంచి రానివారంటూ లేరు. ఆ రోజును నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఎందుకంటే అంతమంది ఆర్టిస్టులను ఒకచోట చూడటం సాధ్యమయ్యే పనికాదు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. ఆర్.నాగేశ్వరరావుతో పాటు ఎంతోమందిని చూశాను. మా అన్నయ్య కొడుకు అంటూ నన్ను కొంతమందికి పరిచయం చేశారు కూడా" అని చెప్పారు. 

"సావిత్రి గారు 'మాయా బజార్' చేయడం కూడా నాకు తెలుసు. ఆమె ఎంత సింపుల్ గా ఉన్నప్పటికీ రాజసం కనిపించేది. ఆత్మీయత .. ఆత్మ విశ్వాసం కొట్టొచ్చినట్టుగా కనిపించేవి. సావిత్రిగారి దాన గుణాన్ని గురించి నేను ఇప్పుడు కొత్తగా చెప్పవలసిన పనిలేదు. మనిషంటే సాధారణంగా ఉండాలి .. సావిత్రిలా ఉండాలని 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ఆమె గురించి చెప్పడానికి నిజంగానే ఆ ఒక్క మాట చాలు" అన్నారు.

More Telugu News