చివరి నిజాం రాజు మనవడు టర్కీలో కన్నుమూత... సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్

Last king of Nizam dies in Turkey
  • ఇస్తాంబుల్ లో తుదిశ్వాస విడిచిన ముఖరంజా
  • ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్
  • అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
అసఫ్ జాహీ వంశానికి చెందిన చివరి, ఎనిమిదవ నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్ మనవడు మీర్ అలీఖాన్ ముఖరంజా బహదూర్ టర్కీలో కన్నుమూశారు. ఇస్తాంబుల్ లో ఆయన తుదిశ్వాస విడిచారు. నిజాం వారసుడి మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలియజేశారు. ముఖరంజా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. 

ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. అంతేకాదు, ముఖరంజా భౌతికకాయం హైదరాబాదుకు చేరుకున్న తర్వాత ఆయన కుటుంబ సభ్యులతో చర్చించి అంత్యక్రియల స్థలాన్ని నిర్ణయించాలని ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్ కు స్పష్టం చేశారు. ముఖరంజా నిజాం వారసుడిగా విద్యావైద్య రంగాల్లో సేవలు అందించారని, పేదల కోసం కృషి చేశారని సీఎం కేసీఆర్ కొనియాడారు. 

నిజాం పెద్ద కుమారుడు అజమ్ ఝా, దుర్రే షెహవార్ దంపతులకు 1933లో ముఖరంజా జన్మించారు. ఆయన విద్యాభ్యాసం డెహ్రాడూన్, లండన్ లో జరిగింది. 80వ దశకంలో ఆయన దేశంలోనే అత్యంత ధనవంతుడిగా పేరుపొందారు. 1971 వరకు ముఖరంజా హైదరాబాద్ యువరాజు హోదాలో ఉన్నారు.
Go Back to Shorts
Nizam
Last King
Demise
Turkey
Hyderabad

More Telugu News