Rahul Gandhi: భారత్ జోడో యాత్రలో విషాదం.. ఎంపీ మృతి

  • పంజాబ్ లో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర
  • యాత్రలో గుండెపోటుకు గురై ఎంపీ సంతోఖ్ సింగ్ ఛౌదరి కన్నుమూత
  • ఈరోజు నిలిచిపోయిన పాదయాత్ర
MP died in Bharat Jodo Yatra

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ ఛౌదరి గుండెపోటుతో మృతి చెందారు. పంజాబ్ లోని ఫిల్లౌర్ ప్రాంతంలో ఈ ఉదయం పాదయాత్ర కొనసాగుతుండగా ఆయన గుండెపోటుకు గురై, కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను పగ్వారాలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆయన కన్నుమూశారు. ఆసుపత్రికి రాహుల్ గాంధీ కూడా వెళ్లారు. ఈ విషాదకర ఘటనతో భారత్ జోడో యాత్రను ఈరోజు ఆపేశారు.

మరోవైపు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ... సంతోఖ్ సింగ్ మృతి పార్టీకి తీరని లోటు అని అన్నారు. ఆయన మరణ వార్తతో షాక్ కు గురయ్యానని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ట్వీట్ చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.

More Telugu News