joshimath: జోషిమఠ్ కుంగుబాటుపై ఇస్రో నివేదిక మాయం

  • 12 రోజుల్లోనే 5.4 సెంటీమీటర్లు కుంగిపోయిందని నివేదిక ఇచ్చిన ఇస్రో
  • నివేదికను తొలగించడంపై జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వివరణ
  • ప్రజల్లో గందరగోళం నెలకొనేలా ప్రకటనలు చేయొద్దంటూ శాస్త్రవేత్తలకు సూచన
Isro report on land subsidence in Joshimath mysteriously withdrawn

దేవభూమి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషిమఠ్ కుంగిపోతున్న విషయం తెలిసిందే! ఏటా 6.5 సెంటీమీటర్లు కుంగిపోతోందంటూ ఉపగ్రహ చిత్రాల ద్వారా శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. ఈ విషయంపై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అనుబంధంగా హైదరాబాద్ నుంచి పనిచేసే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్ సీ) కూడా ఓ నివేదిక విడుదల చేసింది. కేవలం 12 రోజుల వ్యవధిలోనే జోషిమఠ్ ప్రాంతం 5.4 సెంటీమీటర్లు కుంగిపోయిందని తన నివేదికలో పేర్కొంది. గతేడాది డిసెంబర్ 22 నుంచి ఈ ఏడాది జనవరి 8 మధ్య కాలంలో ఈ కుంగుబాటు చోటుచేసుకుందని తెలిపింది. అయితే, ప్రస్తుతం ఈ నివేదిక ఇస్రో వెబ్ సైట్ లో కనిపించడంలేదు. నివేదికకు సంబంధించిన లింక్ ను ఇస్రో తొలగించింది.

గందరగోళానికి తావివ్వొద్దనే..
ఇస్రో నివేదికను తొలగించిన తర్వాత జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్ డీఎంఏ) మీడియాకు ఓ మెమోరాండం విడుదల చేసింది. జోషిమఠ్ కుంగుబాటుపై ప్రభుత్వ రంగ సంస్థలు సొంతంగా విడుదల చేస్తున్న నివేదికలు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని పేర్కొంది. జోషిమఠ్ స్థానికులతో పాటు దేశవ్యాప్తంగా ప్రజల్లో భయాందోళనలను రేకెత్తించేలా ప్రకటనలు చేయడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన ఉన్నతస్థాయి భేటీలో చర్చకు వచ్చిందని తెలిపింది. దీంతో ఈ విషయంపై నేరుగా మీడియాతో మాట్లాడొద్దంటూ శాస్త్రవేత్తలకు ప్రభుత్వం సూచించినట్లు వివరించింది.

More Telugu News