Nagababu: పవన్ కల్యాణ్ రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవుతారు... ఇది తథ్యం!: రణస్థలం సభలో నాగబాబు

  • శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన యువశక్తి సభ
  • జనసేన కుటుంబ పార్టీ కాదన్న నాగబాబు
  • జనసేన అధికారంలోకి వస్తే పదవులు చేపట్టబోనని వెల్లడి
  • పార్టీ కోసమే పనిచేస్తానని స్పష్టీకరణ
Nagababu speech in Yuvashakti meeting

శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన పార్టీ ఏర్పాటు చేసిన యువశక్తి సభకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు కూడా హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ, జనసేన కుటుంబ పార్టీ కాదని, కుల పార్టీ అంతకన్నా కాదని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ కులాలకు సమ ప్రాధాన్యతనిచ్చే పార్టీ జనసేన అని ఉద్ఘాటించారు. పవన్ కల్యాణ్ లాగా నాయకత్వ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరిదీ జనసేన అని పేర్కొన్నారు. 

"నేను పవన్ కల్యాణ్ సోదరుడ్ని. ఈ సందర్భంగా జనసేన కుటుంబ పార్టీ కాదని స్పష్టం చేయదలచుకున్నాను. ఎలాగంటే... నేను జనసేన పార్టీ అభివృద్ధికి, నిర్మాణానికి ఒక మెట్టులా పాటుపడతానే తప్ప భవిష్యత్తులో జనసేన పార్టీ అధికారంలోకి వస్తే అందులో నేను పాలుపంచుకోను. కేవలం పార్టీ కోసమే పనిచేస్తాను. ఆ విధంగా జనసేన కుటుంబ పార్టీ కాదు, ఇది మీ అందరి పార్టీ. 

ఈ సందర్భంగా ఇంకొక విషయం చెప్పాలి. మన నాయకుడు పవన్ కల్యాణ్ రాబోయే రోజుల్లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు... ముఖ్యమంత్రి అవుతారు... ఇది తథ్యం. జనసేన పార్టీలో ప్రతి ఒక్కరికి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశం కల్పించే పార్టీ ఒక్క జనసేన మాత్రమే. కష్టపడితే సీఎం అయ్యేందుకు కూడా జనసేనలో అవకాశం ఉంటుంది" అని నాగబాబు ఉద్ఘాటించారు.  

యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించకుండా యువశక్తిని నిర్లక్ష్యం చేస్తోందని వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేది, వారిని పరిపాలనలో భాగస్వాములను చేసే పార్టీ జనసేన అని చెప్పుకొచ్చారు. 

ఈ సందర్భంగా నాగబాబు "హమ్ దేఖేంగే... హమ్ దేఖేంగే" అంటూ పాకిస్థానీ కవి ఫయాజ్ అహ్మద్ రాసిన ఓ స్ఫూర్తిదాయక గీతాన్ని చదివి వినిపించారు. మీ నియంతృత్వ పోకడలు ఉన్న ప్రభుత్వ పతనాన్ని మేం చూడడం తథ్యం... తారస్థాయికి చేరిన మీ క్రూరత్వం, మీ అణచివేత దూదిపింజెల్లా ఎగిరిపోవడం మేమందరం చూస్తాం... ఇది తథ్యం ఇది తథ్యం అంటూ ఆ గీతం సారాంశాన్ని వివరించారు. పాకిస్థాన్ నియంతగా పేరుగాంచిన జియావుల్ హక్ కోటను ఈ పాట కూల్చివేసిందని అన్నారు. ఈ గీతం అంత చైతన్యం కలిగించిందని తెలిపారు.

More Telugu News