Ramachandra Yadav: అమిత్ షా ను కలిసిన పుంగనూరు నేత రామచంద్ర యాదవ్

  • తనపై, తన కుటుంబ సభ్యులపై పెద్దిరెడ్డి దాడి చేయించారని అమిత్ షాకు ఫిర్యాదు చేశానన్న రామచంద్ర
  • విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చారని వెల్లడి
  • తనకు భద్రతను కల్పిస్తామని హామీ ఇచ్చారన్న రామచంద్ర
Punganuru leader Ramachandra Yadav meets Amit Shah

చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన వ్యాపారవేత్త, స్థానిక నేత రామచంద్ర యాదవ్ నివాసంపై కొందకు వ్యక్తులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆయన ఇంటి తలుపులు పగులగొట్టి, ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఇంటి ఆవరణలో ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను రామచంద్ర యాదవ్ కలిశారు. దాదాపు 40 నిమిషాల పాటు వీరి సమావేశం కొనసాగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై అమిత్ షాకు రామచంద్ర ఫిర్యాదు చేశారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై, తన కుటుంబ సభ్యులపై మంత్రి పెద్దిరెడ్డి అనుచరులతో దాడి చేయించారని అమిత్ షాకు చెప్పానని తెలిపారు. పెద్దిరెడ్డిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగానికి బదులు జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం నడుస్తోందని అన్నారు. జరిగిన ఘటనపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని అమిత్ షా చెప్పారని తెలిపారు. తనకు భద్రతను కూడా కల్పిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు.

2019 ఎన్నికల్లో పుంగనూరు నుంచి పోటీ చేశానని... వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై దాడి చేశారని చెప్పారు. గత నెల 4వ తేదీని రైతుభేరి, రైతుల దాడులపై సమావేశం పెట్టుకున్నామని... హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ సభను పెట్టుకోనివ్వలేదని, పుంగనూరులో పెద్దిరెడ్డి రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. తన కుటుంబాన్ని హతమార్చే ప్రయత్నం చేశారని చెప్పారు. తనపై దాడికి పోలీసు వ్యవస్థ కూడా కారణమని అన్నారు.

More Telugu News