కంటెంట్ ఉన్న సినిమా దేశమంతా ఆడుతుంది... కంటెంట్ ఉన్న నేత ఎందుకు హిట్ కాడు?: కేటీఆర్

KTR attends Katha Rachana book launch event
  • 'కథారచన' పుస్తకం రాసిన దర్శకుడు దశరథ్
  • ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో పుస్తకావిష్కరణ కార్యక్రమం
  • హాజరైన మంత్రి కేటీఆర్
  • కంటెంట్ ఉన్న నేత పాన్ ఇండియా లీడర్ అవుతాడని వ్యాఖ్య  
సినీ దర్శకుడు దశరథ్ రాసిన 'కథారచన' పుస్తకావిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. హైదరాబాదులోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇవాళ దేశంలో తెలుగు సినిమాల జోరు కొనసాగుతోందని అన్నారు. కంటెంట్ ఉన్న ఏ చిత్రమైనా పాన్ ఇండియా స్థాయికి వెళుతోందని తెలిపారు. అలాంటిది, కంటెంట్ ఉన్న నేత పాన్ ఇండియా లీడర్ కాలేడా? అంటూ తన తండ్రి, సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కంటెంట్ ఉన్న సినిమాలాగే కంటెంట్ ఉన్న నేత కూడా తప్పకుండా హిట్ అవుతాడని పేర్కొన్నారు.

ఇక, ఇండియన్ సినిమాకు హైదరాబాద్ కేంద్రస్థానంగా మారాలని కేటీఆర్ ఆకాంక్షను వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమలో అజ్ఞాతయోధులు ఎంతో మంది ఉంటారని, వక్తల ఉపన్యాసం వెనుక ఎంతో విషయ పరిజ్ఞానం ఉంటుందని తెలిపారు. కరోనా పంక్షోభం వేళ సీఎం కేసీఆర్ ప్రసంగం కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూసేవారని, అందరికీ అర్థమయ్యేలా సులభ శైలిలో చెప్పడం కేసీఆర్ ప్రత్యేకత అని కేటీఆర్ వివరించారు. 

క్రియేటివిటీని తాను ఎంతగానో ఇష్టపడతానని, అమెరికాలో ఉన్నప్పుడు పుస్తకాలు ఎక్కువగా చదివేవాడ్నని, ప్రతి రోజూ పన్నెండు దినపత్రికలు చదివేవాడ్నని వెల్లడించారు.
Go Back to Shorts
KTR
KCR
Katha Rachana
Book
Dasarath
Hyderabad
BRS
Telangana

More Telugu News