Vijayawada: అబ్బాయిలు మోసం చేస్తే హైలైట్ చేస్తారు.. అమ్మాయిల మోసాన్ని ఎందుకు ప్రశ్నించరు?: యువకుడి సూసైడ్ నోట్

  • విజయవాడలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
  • తనను ప్రేమిస్తున్నట్టు నటిస్తూ యువతి మోసం చేస్తోందని మనస్తాపం
  • రైలు కింద తలపెట్టి ఆత్మహత్య
Young Boy Committed Suicide in Vijayawada over Love Affair

టైంపాస్ ప్రేమకు పిచ్చోడినయ్యానంటూ విజయవాడలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. యువతి తనను ప్రేమిస్తున్నట్టు నటిస్తూ మోసం చేయడంతో జీవితంపై విరక్తి చెందిన యువకుడు రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు అతడు రాసిన సూసైడ్‌ నోట్‌లో పలు ప్రశ్నలు సంధించాడు.

పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణలంకకు చెందిన అబ్దుల్ సలాం (19) కానూరులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న విద్యార్థినితో అతడికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే, ఆమె తనను ప్రేమిస్తున్నట్టు నటిస్తూ మోసం చేస్తోందన్న విషయం తెలుసుకున్న అబ్దుల్ తీవ్ర మనస్తాపం చెందాడు. శనివారం రాత్రి వన్‌టౌన్ నైజాం గేటు సెంటరు సమీపంలో రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు అతడు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

ఆమె టైంపాస్ ప్రేమకు తాను పిచ్చోడినయ్యానని ఆ లేఖలో అతడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనను ప్రేమిస్తున్నట్టు నటిస్తూనే ఓ లెక్చరర్‌తో నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడుతోందని పేర్కొన్నాడు. అబ్బాయిలు మోసం చేస్తే హైలైట్ చేస్తారని, మరి అమ్మాయిలు చేస్తున్న ఈ మోసాన్ని సమాజం ఎందుకు ప్రశ్నించదని ప్రశ్నించాడు. కాగా, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం అనంతరం యువకుడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

More Telugu News