Sidiri Appalaraju: చంద్రబాబును పవన్ కల్యాణ్ కలవడానికి కారణం ఇదే: సీదిరి అప్పలరాజు

  • పవన్ కు డబ్బు పిచ్చి పట్టుకుందన్న మంత్రి అప్పలరాజు
  • పవన్ ప్రతి మాటకు ఒక రేటు ఉంటుందని విమర్శ
  • శ్రీకాకుళం సభ స్క్రిప్ట్ కోసమే చంద్రబాబును పవన్ కలిశారని ఎద్దేవా
Pawan met chandrababu for Srikakulam sabha script says Sidiri Appala Raju

టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి జనసేనాని పవన్ కల్యాణ్ వెళ్లడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలసి పోటీ చేయొచ్చనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ పై మంత్రి సీదిరి అప్పలరాజు విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ ఆయనను నమ్మినవారిని ముంచేస్తున్నారని, ఆయనకు డబ్బు పిచ్చి పట్టుకుందని అన్నారు. బీజేపీతో పొత్తులో ఉన్న పవన్.. తన రేటును పెంచుకోవడానికే చంద్రబాబును కలిశారని చెప్పారు. 

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ ఇద్దరూ కలిసినా ఆశ్చర్యం లేదని అన్నారు. సింగిల్ గా పోటీ చేసే దమ్ము చంద్రబాబు, పవన్ లకు ఉందా? అని ప్రశ్నించారు. పవన్ మాట్లాడే ప్రతి మాటకు కచ్చితంగా ఒక రేటు ఉంటుందని విమర్శించారు. రాష్ట్రంలో నీచమైన రాజకీయాలకు పవన్ కేరాఫ్ అడ్రస్ గా మారారని దుయ్యబట్టారు. శ్రీకాకుళంలో జరిగే సభలో స్క్రిప్ట్ కోసమే చంద్రబాబును పవన్ కలిశారని చెప్పారు. ఎవరు ఎవరితో కలిసినా వచ్చే ఎన్నికల్లో వైసీపీ మరోసారి ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News