Sunil Kumar: కొత్తగా నియమితులైన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ దిశానిర్దేశం

  • ఏపీలో కొత్తగా 13 మంది స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం
  • రాష్ట్ర సీఐడీ కార్యాలయంలో సమావేశం
  • అనేక అంశాలపై అవగాహన కలిగించిన సునీల్ కుమార్
CID Chief Sunil Kumar held orientation session for newly appointed special public prosecutors

ఏపీలో కొత్తగా నియమితులైన 13 మంది స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ సమావేశమయ్యారు. రాష్ట్ర సీఐడీ కార్యాలయంలో జరిగిన ఈ ఓరియెంటేషన్ సెషన్ లో నూతన పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు సునీల్ కుమార్ దిశానిర్దేశం చేశారు. వారికి అనేక అంశాలపై అవగాహన కలిగించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, న్యాయస్థానాల్లో సమర్థంగా వాదించే సామర్థ్యం, అనుభవం ఉన్న న్యాయవాదులను స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లుగా ఎంపిక చేసినట్టు వెల్లడించారు. ముఖ్యంగా, సీఐడీ కేసుల విషయంలో కోర్టుల్లో సహేతుకమైన ఆధారాలతో వాదించాలని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు సూచించారు. 

కొందరు నిందితులు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు సీఐడీపైనే అసత్య ఆరోపణలు చేస్తుంటారని, ఆర్థిక నేరాల కేసుల్లోనూ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు తమ వాదనా పటిమ నిరూపించుకోవాలని సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ పేర్కొన్నారు. సునీల్ కుమార్ కు ఏపీ ప్రభుత్వం ఇటీవలే డీజీపీ ర్యాంకు ఇచ్చిన సంగతి తెలిసిందే.

More Telugu News