రెండు గంటల్లో ఆరు చోరీలు.. హైదరాబాద్ లో హడలెత్తించిన స్నాచర్లు
- శనివారం ఉదయం ఆరు చోట్ల స్నాచింగ్
- ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ వరకు వరుస ఘటనలు
- దొంగల కోసం 12 బృందాలతో పోలీసుల గాలింపు
ఉప్పల్ మాస్టర్ చెఫ్ సమీపంలో ఉదయం 6:20 నిమిషాలకు ఓ మహిళ మెడలో నుంచి దుండగులు గోల్డ్ చైన్ ను లాక్కెళ్లారు. ఆ తర్వాత కల్యాణపురిలో వాకింగ్ కు వెళుతున్న మరో మహిళ మెడలోని మంగళసూత్రాన్ని చోరీ చేశారు. నాచారంలోని నాగేంద్రనగర్, ఓయూ పరిసరాల్లోని రవీంద్రనగర్, చిలకలగూడ రామాలయం వీధిలో, రాంగోపాల్ పేట్ పరిధిలో దొంగలు చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. దుండగులు మాస్కులు ధరించి చోరీలకు పాల్పడ్డారు.
ఏ టైమ్ లో ఎక్కడెక్కడ..
ఉప్పల్ లోని రాజధాని కాలనీలో ఉదయం 6:20 గంటలకు మొదటి స్నాచింగ్ ఘటన జరిగింది. కల్యాణ్ పురిలో ఉదయం 6:40 గంటలకు రెండో ఘటన, నాచారంలోని నాగేంద్రన్ కాలనీలో ఉదయం 7:10 గంటలకు మూడో చోరీ, ఓయూ పరిసరాల్లోని రవీంద్రనగర్ లో ఉదయం 7:40 గంటలకు నాలుగో ఘటన, చిలకలగూడ రామాలయం వీధిలో ఉదయం 8 గంటలకు ఐదో చోరీ, రాంగోపాల్ పేట్ పరిధిలో ఉదయం 8:10 గంటలకు ఆరో ఘటన చోటుచేసుకున్నాయి.