Chandrababu: రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు... జగన్ పై నిప్పులు చెరిగిన టీడీపీ అధినేత

Chandrababu fires on Jagan
  • చంద్రబాబు రోడ్ షోను అడ్డుకున్న పోలీసులు
  • సైకో సీఎంకు బానిసలుగా బతకొద్దన్న చంద్రబాబు
  • నల్ల జీవోలతో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని మండిపాటు
సైకో పోవాలి... సైకిల్ రావాలి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కుప్పం నియోజకవర్గం గుడిపల్లిలోని టీడీపీ కార్యాలయానికి వెళ్తున్న ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. తన నియోజవర్గంలో తాను తిరగకుండా అడ్డుకునే హక్కు మీకెవరిచ్చారంటూ చంద్రబాబు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రోడ్ షోకు అనుమతి లేదని చెప్పారు. దీంతో, పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి చంద్రబాబు రోడ్డుపై బైఠాయించారు. ముఖ్యమంత్రి జగన్ పై ఈ సందర్భంగా నిప్పులు చెరిగారు. 

సైకో ముఖ్యమంత్రికి బానిసలుగా బతకొద్దని పోలీసులను ఉద్దేశించి అన్నారు. జీవో 1కు చట్టబద్ధత లేదని అన్నారు. తమ రోడ్ షోలను అడ్డుకుంటున్న ముఖ్యమంత్రికి రాజమండ్రిలో రోడ్ షో నిర్వహించడానికి సిగ్గులేదా? అని ప్రశ్నించారు. నిన్న కూడా పలు ప్రాంతాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు రోడ్ షోలు నిర్వహించారని మండిపడ్డారు. వైసీపీ నేతలకు ఒక రూలు, తనకు ఒక రూలా? అని ప్రశ్నించారు. తనను పంపించేయాలని అనుకుంటే... పోలీసులనే తాను పంపించేస్తానని హెచ్చరించారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులను మళ్లీ గాడిలో పెడతానని చెప్పారు. పోలీసులు బాధ్యతతో వ్యవహరిస్తూ... ప్రజలకు మేలు చేయాలని అన్నారు. తుగ్లక్ పాలన కొనసాగిస్తున్న జగన్ నల్ల జీవోలతో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని మండిపడ్డారు.

More Telugu News

Chandrababu
Telugudesam
YSRCP
Jagan