Team India: భారత్ బౌలింగ్ ను చీల్చిచెండాడిన శ్రీలంక... పూణేలో భారీ స్కోరు

Sri Lanka batsmen hammers Team India bowling in 2nd T20
  • పూణేలో టీమిండియా, శ్రీలంక రెండో టీ20
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగులు చేసిన లంక
  • షనక, కుశాల్ మెండిస్ అర్ధసెంచరీలు
  • రాణించిన అసలంక, నిస్సాంక
టీమిండియాతో రెండో టీ20 మ్యాచ్ లో శ్రీలంక బ్యాట్స్ మెన్ విరుచుకుపడ్డారు. భారీ సిక్సర్లతో భారత బౌలర్లను బెంబేలెత్తించారు. పూణేలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగుల భారీ స్కోరు సాధించింది. 

శ్రీలంక కెప్టెన్ దసున్ షనక కేవలం 22 బంతుల్లోనే 56 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. షనక స్కోరులో 2 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి. అంతకుముందు, చరిత్ అసలంక 19 బంతుల్లోనే 37 పరుగులు చేశాడు. అసలంక 4 సిక్సులు కొట్టాడు. ఓపెనర్ కుశాల్ మెండిస్ 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 52 పరుగులు చేయగా, మరో ఓపెనర్ పత్తుమ్ నిస్సాంక 33 పరుగులు సాధించాడు. 

టీమిండియా బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 3, అక్షర్ పటేల్ 2, యజువేంద్ర చహల్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు భారీగా నోబాల్స్ వేసి తగిన మూల్యం చెల్లించుకున్నారు. అర్షదీప్ సింగ్ ఒక్కడే 5 నోబాల్స్ విసిరాడు. అర్షదీప్ 2 ఓవర్లు విసిరి 37 పరుగులు సమర్పించుకున్నాడు. ఉమ్రాన్ మాలిక్ మొదట బాగానే బౌలింగ్ చేసినా, అతడి ఆఖరి ఓవర్లో లంక బ్యాట్స్ మన్ 21 రన్స్ సాధించి పండగ చేసుకున్నారు.
Team India
Sri Lanka
2nd T20
Pune

More Telugu News