New Delhi: మా అమ్మాయికి తాగే అలవాటు లేదు.. అసలు ఆ నిధి పేరే వినలేదంటూ.. ఢిల్లీ కారు ఘటన మృతురాలి తల్లి కీలక వ్యాఖ్యలు

  • ఆమె స్నేహితురాలు నిధి అబద్ధం చెబుతోందన్న అంజలి తల్లి
  • స్నేహితురాలైతే ప్రమాదం జరిగినప్పుడు ఎలా వదిలేసి వెళ్తుందని ప్రశ్న
  • కుట్రలో నిధి కూడా భాగం కావొచ్చని ఆరోపణ
Anjali did not drink never heard of Nidhi Victims family refutes friends claims

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ కారు ప్రమాద ఘటనకు సంబంధించి మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కారు ఢీకొని ఈడ్చుకెళ్లి మరణించిన 20 ఏళ్ల అంజలి సింగ్ తల్లి ఈ సంఘటన సమయంలో తన కుమార్తె మద్యం తాగి ఉందన్న ఆమె స్నేహితురాలు నిధి వాదనలను తీవ్రంగా ఖండించారు. ‘నా కూతురు ఎప్పుడూ మద్యం సేవించలేదు. ఆమె ఎప్పుడూ తాగి ఇంటికి రాలేదు. నిధి అబద్ధం చెబుతోంది’ అని అంజలి తల్లి రేఖాదేవి స్పష్టం చేశారు. నిధిని తన కుమార్తెతో కలిసి ఎప్పుడూ చూడలేదని, ఆ మహిళ  ఏనాడూ తమ ఇంటికి రాలేదని ఆమె చెప్పారు. 

తన కుమార్తె మరణం కుట్రలో నిధి భాగమని ఆమె ఆరోపించారు. ‘నేను నిధిని ఎప్పుడూ చూడలేదు. ఆమె పేరు కూడా వినలేదు. ఆమె ఎప్పుడూ మా ఇంటికి రాలేదు. ఆమె నా కూతురి స్నేహితురాలైతే, ఆమెను వదిలేసి ఎలా పారిపోతుంది? ఇది పథకం ప్రకారం చేసిన కుట్ర. ఇందులో నిధి పాత్ర కూడా ఉండొచ్చు. దీనిపై సమగ్ర విచారణ జరపాలి' అని ఆమె డిమాండ్ చేశారు. కాగా, కారు ఘటన జరిగిన రోజు రాత్రి అంజలి మద్యం మత్తులో ఉందని, ఆమె స్పృహలో లేదని నిధి చెప్పింది. కానీ, శవపరీక్ష నివేదికలో ప్రమాదం జరిగిన రాత్రి ఆమె మద్యం సేవించిన ఆనవాళ్లు కనిపించలేదని వెల్లడైంది.

More Telugu News