Income Tax: హైదరాబాద్ లో మళ్లీ ఐటీ సోదాలు.. ఏకకాలంలో 20 బృందాల దాడి

  • ఐటీ కార్యాలయంలో 40 కార్లలో బయల్దేరిన అధికారులు
  • గచ్చిబౌలి, బాచుపల్లి, చందానగర్ లో సోదాలు
  • ఎక్సెల్ కంపెనీ లక్ష్యంగా దాడులు 
IT raids in hyderabad with 20 groups

హైదరాబాద్‌ నగరంలో మరోసారి ఇన్ కమ్ ట్యాక్స్ (ఐటీ) సోదాలు చర్చనీయాంశమయ్యాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. నగరంలో ఐటీ శాఖ కార్యాలయం నుంచి ఈ ఉదయమే పదుల సంఖ్యలో ఐటీ అధికారులు 40 కార్లు.. మూడు సీఆర్పీఎఫ్ వెహికిల్స్‌లో నిర్దేశిత ప్రాంతాలకు బయలుదేరారు. 20 బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. గచ్చిబౌలిలోని ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కార్యాలయం లక్ష్యంగా సోదాలు చేస్తున్నట్టు సమాచారం.

ట్యాక్స్ చెల్లింపులు అవకతవకలు జరిగినట్టు గుర్తించడంతో ఈ దాడులు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ కంపెనీకి చెందిన ఆరుగురు డైరెక్టర్ల నివాసాల్లో, బాచుపల్లి, చందా నగర్‌లోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఎక్సెల్ ప్రధాన కార్యాలయం చెన్నైలోనూ సోదాలు జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా మొత్తం పద్దెనిమిది చోట్ల ఐటీ సాదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కాగా, కొంతకాలంగా హైదరాబాద్‌లో ఐటీ దాడులు చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల మంత్రి మల్లారెడ్డితో పాటు ఇతర ప్రముఖుల ఇళ్లు, సంస్థల్లో సోదాలు జరిగాయి. ఇప్పుడు మరోసారి ఐటీ అధికారులు బయటకు రావడంతో బడా వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది.

More Telugu News