Chandrababu: గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 'కుండబద్దలు' సుబ్బారావును పరామర్శించిన చంద్రబాబు

  • సీఎంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడంటూ సుబ్బారావుకు నోటీసులు
  • కిడ్నీల వ్యాధితో బాధపడుతున్న సుబ్బారావు
  • ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరిక
  • డాక్టర్లతో మాట్లాడిన చంద్రబాబు
Chandrababu visits Kundabaddalu Subbarao

ఇటీవల సీఎం జగన్, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడంటూ 'కుండబద్దలు' యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు కాటా సుబ్బారావుకు పోలీసులు నోటీసులు అందించడం తెలిసిందే. 2020లో ఆయనపై ఫిర్యాదు చేయగా, అనంతపురం జిల్లా గుమ్మగట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. 

కాగా, కుండబద్దలు సుబ్బారావు ఆరోగ్యం క్షీణించడంతో ఆయన గుంటూరు ఆసుపత్రిలో చేరారు. గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నేడు గుంటూరు పర్యటనకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆసుపత్రికి వెళ్లి కాటా సుబ్బారావును పరామర్శించారు. సుబ్బారావు ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. 

కాటా సుబ్బారావు స్వస్థలం పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం గ్రామం. ఆయన వయసు 70 సంవత్సరాలు. ఆయన కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. గుంటూరు ఆసుపత్రిలో ఆయన క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటుంటారు.

More Telugu News