Team India: కారు నుంచి బయటకు తీసిన వెంటనే పంత్ చెప్పిన మాట ఇదే

  • మొబైల్ తీసి తన తల్లికి ఫోన్ చేయమన్నాడని వెల్లడించిన బస్ డ్రైవర్
  • అతని తల్లికి ఫోన్ కలవకపోవడంతో పోలీసులు, ఆంబులెన్స్ కు ఫోన్ చేసిన వైనం
  • రిషబ్ పంత్ ను కాపాడిన బస్ డ్రైవర్ పై సర్వత్రా ప్రశంసల వర్షం
Meri mummy ko phone mila do How bus driver Sushil Kumar saved Rishabh Pant

రిషబ్ పంత్‌కు ప్రమాదం తర్వాత అతడిని కాపాడిన హర్యానా రోడ్‌వేస్ డ్రైవర్ సుశీల్ కుమార్ ఆ జరిగిన సంఘటన మొత్తాన్ని ఓ ఆంగ్ల పత్రికతో కళ్లకు కట్టినట్టు తెలిపాడు. ప్రమాదం జరిగిన వెంటనే తాము కారు వద్దకు చేరుకొని పంత్ ను రోడ్డు మీద పడుకోబెట్టామన్నాడు. ‘వెంటనే స్పృహలోకి వచ్చిన పంత్ తో కారులో ఇంకెవరైనా ఉన్నారా? అని అడిగాం. ఒంటరిగానే వచ్చానని చెప్పిన పంత్ తన మొబైల్ తీసివ్వాలని సైగ చేశారు. తన శక్తినంతా కూడదీసుకొని తల్లికి ఫోన్ చేయమని నన్ను అడిగారు. నంబర్ డయల్ చేస్తే స్విచాఫ్ వచ్చింది’ అని సుశీల్ తెలిపాడు. తల్లికి ఫోన్ కలవకపోవడంతో వెంటనే పోలీసులు, అంబులెన్స్ కు ఫోన్ చేశానని వెల్లడించాడు. 

తనకు పంత్ ఎవరో తెలియకపోయిన కేవలం మానవతా దృక్ఫథంతో సాయం చేశానని, ఆ ఘటనలో ఎవరున్నా తాను అలానే చేసేవాడినని చెప్పాడు. ‘ప్రమాదం చూసిన తర్వాత నేను ఆ వ్యక్తిని అలా వదిలేయలేను. తనను కారులో నుంచి బయటకు తీసుకొచ్చా. ఆ సమయంలో పంత్ నుదిటి నుంచి కాళ్ల నుంచి చాలా రక్తం కారుతోంది. నాకు హెల్ప్ చేయడానికి వచ్చిన ప్రయాణికుల్లో ఇతను క్రికెటర్ రిషబ్ పంత్ అని చెప్పారు. కానీ నేను క్రికెట్ ను చూడను కాబట్టి తనను గుర్తుపట్టలేకపోయా. క్రికెటర్లలో నాకు సచిన్, ధోనీ మాత్రమే తెలుసు. ప్రమాదానికి గురైంది క్రికెటర్ కావొచ్చు.. కోటీశ్వరుడు కావొచ్చు.. నేను తనకు సాయం చేసి ప్రాణాలు కాపాడాలని అనుకున్నా’ అని చెప్పుకొచ్చాడు. కాగా, రిషబ్ పంత్ ను కాపాడటంతో డ్రైవర్ సుశీల్ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

More Telugu News