భారత్ ప్రపంచ ఫార్మసీ కేంద్రం అని గొప్పలు చెప్పుకోవడం మానేయాలి: కాంగ్రెస్
- కఠిన చర్యలు తీసుకోవాలంటూ జైరామ్ రమేశ్ ట్వీట్
- గాంబియా మరణాలకు భారత దగ్గు మందు కారణం కాదన్న బీజేపీ నేత మాలవీయ
- మోదీ పట్ల ద్వేషంతో పారిశ్రామిక స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని విమర్శ
‘‘భారత్ లో తయారైన దగ్గు మందులు ప్రాణాంతకంగా అనిపిస్తున్నాయి. మొదట గాంబియాలో 70 మంది చిన్నారులు, ఇప్పుడు ఉజ్బెకిస్థాన్లో 18 మంది.. మోదీ సర్కారు భారత్ ను ప్రపంచ ఫార్మసీ కేంద్రంగా గొప్పలు చెప్పుకోవడం మానేయాలి. కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని జైరామ్ రమేశ్ ట్వీట్ చేశారు.
బీజేపీ మీడియా కార్యదర్శి అమిత్ మాలవీయ దీనికి ఘాటుగా బదులిచ్చారు. ‘‘గాంబియాలో చిన్నారుల మరణాలు భారత్ లో తయారు చేసిన దగ్గు మందు తాగడం వల్ల కాదు. ఇదే విషయాన్ని గాంబియన్ అధికారులు, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా స్పష్టం చేశారు. కానీ మోదీ పట్ల విద్వేషంతో కాంగ్రెస్ భారత పారిశ్రామిక స్ఫూర్తిని దెబ్బ తీస్తోంది. సిగ్గు చేటు’’ అని మాలవీయ ట్వీట్ చేశారు.