Mallu Bhatti Vikramarka: మేం ఎవరి రాజీనామాకు డిమాండ్ చేయలేదు: భట్టి విక్రమార్క

  • ఇటీవల పీసీసీ కమిటీల ప్రకటన
  • తెలంగాణ కాంగ్రెస్ లో సంక్షోభం
  • భట్టి నివాసంలో సీనియర్ల భేటీ
  • టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన 12 మంది రాజీనామా
  • వాళ్లంతా తమ సన్నిహితులేనన్న భట్టి
Bhatti says the did not demand for resignations

తెలంగాణ కాంగ్రెస్ లో సంక్షోభం కొనసాగుతోంది. ఇటీవల పీసీసీ కమిటీలు ప్రకటించగా, సీనియర్లను కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి ప్రాధాన్యత కల్పించారన్న అసంతృప్తి గళాలు వినిపించాయి. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో సీనియర్లు సమావేశమై వాడీవేడి చర్చలు జరిపారు. అటు, టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన 12 మంది నేతలు రాజీనామా చేయడంతో సంక్షోభం తీవ్రరూపు దాల్చింది. 

దీనిపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. తాము ఎవరి రాజీనామాకు డిమాండ్ చేయలేదని స్పష్టం చేశారు. కమిటీల నుంచి ఎవరినీ తొలగించాలని కూడా తాము చెప్పలేదని స్పష్టం చేశారు. వాళ్లంతా తమ సన్నిహితులేనని అన్నారు. అయితే, నిన్నగాక మొన్న వచ్చిన వాళ్లకు పదవులు వచ్చాయని, కాంగ్రెస్ పార్టీలో చాలాకాలంగా పనిచేస్తున్న వాళ్లకు అన్యాయం జరిగిందన్నదే తమ వాదన అని భట్టి వ్యాఖ్యానించారు. 

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ, గాంధీభవన్ లో పైరవీకారులకే పెద్దపీట అని విమర్శించారు. పార్టీ కోసం పనిచేసేవారికి కమిటీల్లో ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించారు. ఢిల్లీ పెద్దల సూచనల మేరకే తాను కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నానని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ప్రతి కార్యకర్త పీసీసీ చీఫ్ తో సమానం అని అన్నారు. సీనియర్లకు అన్యాయం జరిగిందని, సమస్య పరిష్కారం కోసం అధిష్ఠానం పంపించిన దిగ్విజయ్ సింగ్ ఈ విషయంపై దృష్టి పెట్టాలని కోరారు.

More Telugu News