విశాఖ బీచ్ రోడ్డులో అర్ధరాత్రి మద్యం తాగుతూ యువతి వీరంగం.. అడ్డుకున్న పోలీసులకు అంతుచూస్తానని బెదిరింపు!

Drunken Woman Warns Police in Vizag Beach Road
  • వెళ్లిపొమ్మన్న పోలీసులను బూతులు తిట్టిన యువతి
  • ఏఎస్‌ఐని కాలితో తన్నుతూ వీరంగం
  • తన ‘ఏటీఎం’కు చెప్పి పోలీస్ డిపార్ట్‌మెంట్ సంగతి తేలుస్తానని హెచ్చరిక
  • నిందితురాలిని పాత డెయిరీఫామ్‌కు చెందిన శ్రీలతగా గుర్తింపు
విశాఖపట్టణం బీచ్ రోడ్డులో ఓ యువతి అర్ధరాత్రి బహిరంగంగా మద్యం తాగుతూ వీరంగం సృష్టించింది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై విరుచుకుపడింది. అంతేకాదు, పోలీసు డిపార్ట్‌మెంట్ అంతు చూస్తానని బెదిరించింది. పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో బీచ్ రోడ్డులోని వైఎంసీఏ సమీపంలో బైక్‌ వద్ద ఓ యువతి మద్యం తాగుతూ కనిపించింది. అది చూసిన స్థానికులు 'నడిరోడ్డుపై ఇదేం పని?' అని ప్రశ్నించారు. ఆమె తిరగబడడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి ఇక్కడ ఇలా బహిరంగంగా మద్యం తాగొద్దని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. 

పోలీసుల మాటలకు ఆమె వీరావేశంతో ఊగిపోయింది. నన్నే ప్రశ్నిస్తారా?.. నా ‘ఏటీఎం’కు చెప్పి మీ డిపార్ట్‌మెంట్ అంతు చూస్తానంటూ బూతులు తిడుతూ రెచ్చిపోయింది. అక్కడితో ఆగకుండా ఏఎస్ఐ సత్యనారాయణను కాలితో తన్నింది. అది చూసిన అక్కడే ఉన్న యువకుడు ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేయగా, బీరు సీసాతో అతడిని గాయపరిచింది. దాదాపు గంటపాటు ఈ తతంగం సాగింది. ఆ తర్వాత మహిళా పోలీసులు అక్కడికి చేరుకుని స్థానికుల సాయంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. 

అనంతరం ఆమెకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించగా 149 పాయింట్లుగా చూపించింది. అప్పటికే సమయం అర్ధరాత్రి దాటడంతో అప్పటికి ఆమెను ఇంటి వద్ద దిగబెట్టిన పోలీసులు ఉదయం వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఆమెను పాత డెయిరీఫామ్‌కు చెందిన ఎం.శ్రీలత (24)గా పోలీసులు గుర్తించారు. మద్యం తాగడానికి ముందు ఆమె గంజాయి కూడా తీసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
Go Back to Shorts
Visakhapatnam
Beach Road
Drunken Girl

More Telugu News