AP High Court: ఇప్పటం గ్రామస్థులకు మరోసారి ఎదురుదెబ్బ... పిటిషన్ ను డిస్మిస్ చేసిన హైకోర్టు

  • ఇటీవల ఇప్పటంలో కూల్చివేతలు
  • న్యాయస్థానాన్ని ఆశ్రయించిన గ్రామస్థులు 
  • నోటీసులు ఇవ్వకుండా కూల్చారని ఆరోపణ 
  • నోటీసులు ఇచ్చాకే కూల్చామని నిరూపించిన సర్కారు
  • గ్రామస్థులకు రూ.లక్ష జరిమానా వేసిన కోర్టు
  • రిట్ పిటిషన్ వేసిన గ్రామస్తులు 
High Court dismiss Ippatam villagers pettion

ఇప్పటం గ్రామంలో ఇటీవల ప్రభుత్వం పలు నిర్మాణాలను కూల్చివేయడం తెలిసిందే. దీనిపై ఇప్పటం గ్రామస్థులు తమకు నోటీసులు ఇవ్వకుండా కూల్చారంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, స్టే లభించింది. అయితే, తాము నోటీసులు ఇచ్చిన తర్వాతే కూల్చివేతలు చేపట్టామన్న విషయాన్ని ప్రభుత్వం ఆధారాలతో సహా హైకోర్టులో నిరూపించింది. నోటీసుల విషయం దాచిపెట్టి స్టే పొందారంటూ హైకోర్టు, 14 మందికి రూ.1 లక్ష చొప్పున జరిమానా విధించింది. 

సింగిల్ బెంచ్ ఇచ్చిన ఈ తీర్పును ఇప్పటం గ్రామస్థులు హైకోర్టు డివిజన్ బెంచ్ వద్ద సవాల్ చేశారు. సింగిల్ బెంచ్ తీర్పును సమీక్షించాలంటూ రిట్ పిటిషన్ వేశారు. అయితే, ఇప్పటం గ్రామస్థులకు మరోసారి చుక్కెదురైంది. డివిజన్ బెంచ్ కూడా వారికి వ్యతిరేకంగానే తీర్పు వెలువరించింది. వారు దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టిపారేసింది. 

అంతకుముందు, సింగిల్ బెంచ్ తీర్పునిచ్చే సమయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

పిటిషనర్ల తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపిస్తూ, పిటిషనర్లు చిన్న రైతులు అని, పెద్ద జరిమానా చెల్లించలేరని పేర్కొనగా, పిటిషనర్లపై దయచూపితే ఇటువంటి చర్యలను ప్రోత్సహించినట్టు అవుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది.

More Telugu News