Naveen Reddy: వైశాలి కిడ్నాప్ కేసు నిందితుడు నవీన్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

  • ఈ నెల 9న వైశాలి ఇంటిపై దాడి
  • వైశాలి ఇంటిని ధ్వంసం చేసి కిడ్నాప్ చేసిన నవీన్ రెడ్డి
  • వైశాలిని కాపాడిన పోలీసులు 
  • నవీన్ రెడ్డి కోసం తీవ్ర గాలింపు
  • గోవాలో పట్టుబడిన నవీన్ 
Police arrest Vaishali kidnap case accused Naveen Reddy in Goa

రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో ఇటీవల వైశాలి అనే యువతి కిడ్నాప్ ఉదంతం తీవ్ర కలకలం రేపడం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని ఆదిభట్ల పోలీసులు నేడు అదుపులోకి తీసుకున్నారు. నవీన్ రెడ్డిని గోవాలో అరెస్ట్ చేశారు. 

వైశాలి కిడ్నాప్ అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో నవీన్ రెడ్డి పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్ర గాలింపు చేపట్టారు. అనేక బృందాలతో విస్తృతస్థాయిలో వెదికారు. చివరికి గోవాలోని కాండోలిమ్ బీచ్ వద్ద అతడిని అదుపులోకి తీసుకున్నారు. నవీన్ రెడ్డిని పోలీసులు గోవా నుంచి హైదరాబాద్ తరలిస్తున్నారు. 

ఈ నెల 9న నవీన్ రెడ్డి పెద్ద సంఖ్యలో తన అనుచరులను వెంటేసుకుని వైశాలి ఇంటిపై దాడి చేసి, అడ్డొచ్చిన ఆమె కుటుంబ సభ్యులను కొట్టి వైశాలిని కిడ్నాప్ చేశాడు. కారులో వైశాలిని కూడా తీవ్రంగా హింసించినట్టు తెలిసింది. వైశాలితో తనకు గతంలో పెళ్లి జరిగిందని నవీన్ రెడ్డి చెప్పినా, అవన్నీ అసత్యాలేనని వైశాలి కొట్టిపారేసింది.

More Telugu News