అది కేసీఆర్ తరం కాదు.. ఆసుపత్రి నుంచి వైఎస్ షర్మిల వీడియో సందేశం.. వీడియో ఇదిగో

YS Sharmial video message from hospital
  • అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న షర్మిల
  • పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి వీడియో సందేశం
  • కోర్టుకు కూడా గౌరవం ఇవ్వలేదని కేసీఆర్ పై మండిపాటు
తన పాదయాత్రకు అనుమతి ఇవ్వడం లేదంటూ షర్మిల చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆమె ఆసుపత్రి నుంచి ఒక వీడియోను విడుదల చేశారు. 

వీడియోలో ఆమె ఏం మాట్లాడారో ఆమె మాటల్లోనే... ''హైకోర్టు పాదయాత్ర చేసుకోమని అనుమతినిచ్చినా కేసీఆర్ గారు పోలీసుల భుజాన తుపాకీ పెట్టి, పాదయాత్రను టార్గెట్ చేసి, కోర్టుకు కూడా గౌరవం ఇవ్వకుండా పాదయాత్రను ఆపే ప్రయత్నం చేశారు. నేను ఆమరణ దీక్ష చేస్తానంటే... వైఎస్సార్టీపీ నాయకులను, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి, బందీలను చేశారు. దీక్ష చేస్తున్న లోటస్ పాండ్ కు అన్ని వైపులా బ్యారికేడ్లు పెట్టారు. చెక్ పోస్టులు పెట్టారు. కర్ఫ్యూ విధించారు. కర్ఫ్యూ విధించి, వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న కార్యకర్తలను మెడబట్టి పోలీస్ వ్యాన్లలో ఎక్కించి, పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లి కొట్టి, తిట్టి నానా రకాలుగా హింసించారు కేసీఆర్ గారు. వైఎస్సార్టీపీ నాయకులు, కార్యకర్తలు అన్నీ భరించారు. 

రాజశేఖరరెడ్డి బిడ్డ ఒకటి మాత్రం చెపుతుంది. మీ త్యాగాలను నేను ఎప్పటికీ మరువను. ఇంత చిత్రహింసలను భరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా రాజశేఖరరెడ్డి బిడ్డ కృతజ్ఞతలు చెప్పుకుంటోంది. వైఎస్సార్ పై ఉన్న అభిమానాన్ని మీరు మరొక్కసారి నిరూపించుకున్నారు. ఒక విషయాన్ని మళ్లీ గుర్తు చేస్తున్నా. రాజశేఖరరెడ్డి బిడ్డను పంజరంలో పెట్టి బంధించొచ్చని కేసీఆర్ గారు అనుకుంటున్నట్టున్నారు. అది కేసీఆర్ తరం కాదు. ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరు. వైఎస్సార్టీపీని ఎందుకు పెట్టామనేది మరొక్కసారి గుర్తు చేసుకుందాం. రాజశేఖరరెడ్డ గారి సంక్షేమ పాలనను మళ్లీ తేవడం కోసం. అది సాధించేంత వరకు మీరందరూ రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తారనే నమ్మకం నాకు ఉంది'' అని వీడియో ద్వారా ఆమె స్పందించారు.
Go Back to Shorts
YS Sharmila
YSRTP
Hospital
Video
KCR
TRS

More Telugu News