Mandouse: తీవ్ర తుపాను నుంచి తుపాను స్థాయికి బలహీనపడిన 'మాండూస్'

  • బంగాళాఖాతంలో మాండూస్
  • చెన్నైకి 260 కిమీ దూరంలో కేంద్రీకృతం
  • ఈ అర్ధరాత్రి తర్వాత తీరం దాటే అవకాశం
  • అర మీటరు ఎత్తున ఉప్పెన వచ్చే అవకాశం
  • దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అత్యంత భారీ వర్షాలు!
Mandouse weakened into cyclonic storm

బంగాళాఖాతంలో 'మాండూస్' తీవ్ర తుపాను బలహీనపడింది. తీవ్రత తగ్గినప్పటికీ 'మాండూస్' ఇంకా తుపాను స్థాయిలోనే ఉంది. ప్రస్తుతం ఇది చెన్నైకి తూర్పు ఆగ్నేయ దిశగా 260 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీని గమనాన్ని కచ్చితంగా అంచనా వేసేందుకు కారైక్కాల్, చెన్నైలోని డాప్లర్ వెదర్ రాడార్లతో పరిశీలిస్తున్నట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. 

ఇది వాయవ్య దిశగా పయనించి ఈ అర్ధరాత్రి తర్వాత పుదుచ్చేరి, శ్రీహరికోటల మధ్య మహాబలిపురంకు సమీపంలో తీరం చేరనుంది. తుపాను తీరం చేరే సమయంలో గరిష్ఠంగా 85 కిమీ వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ వెల్లడించింది. అంతేకాదు, తుపాను తీరాన్ని దాటే ప్రాంతంలో అరమీటరు ఎత్తున ఉప్పెన వచ్చే అవకాశం ఉందని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.  

'మాండూస్' తుపాను ప్రభావంతో నేడు ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. 

ఈ నెల 10వ తేదీన చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఉత్తర తమిళనాడు, రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఈ సమయంలో సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టం చేసింది.

More Telugu News