Madan Lal: దేశానికే తొలి ప్రాధాన్యం ఇచ్చి ఐపీఎల్ సమయంలో విశ్రాంతి తీసుకోండి: టీమిండియా క్రికెటర్లకు మదన్ లాల్ హితవు

  • ఇటీవల టీమిండియా ఆటగాళ్లకు గాయాలు
  • జట్టుకు దూరమవుతున్న కీలక ఆటగాళ్లు
  • విమర్శనాస్త్రాలు సంధించిన మదన్ లాల్
Madan Lal take a swipe at Team India players

ఇటీవల కాలంలో టీమిండియా క్రికెటర్లు తరచుగా గాయాల బారిన పడుతుండడం, కీలక మ్యాచ్ లలో జట్టు ఓడిపోతుండడం తెలిసిందే. దీనిపై భారత క్రికెట్ మాజీ ఆటగాడు మదన్ లాల్ స్పందించారు. అరకొర ఫిట్ నెస్ తో వస్తున్న ఆటగాళ్లను జాతీయ జట్టులో ఎలా ఆడించగలం? అని కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించడం పట్ల మదన్ లాల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

ఓ కెప్టెన్ ఇలా వ్యాఖ్యానించాల్సి రావడం బాధాకరమని పేర్కొన్నారు. ఓ కెప్టెన్ ఇలా అంటున్నాడంటే ఎక్కడో ఏదో లోపం ఉందనే అర్థం అని మదన్ లాల్ స్పష్టం చేశారు. 

"దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ట్రైనర్లు బాధ్యత తీసుకుంటారా? అన్ ఫిట్ ఆటగాళ్లు జాతీయ జట్టులో ఆడేందుకు ఎందుకు వెళుతున్నారు? సగం ఫిట్ నెస్ తో మీరు అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నారు... దాని ఫలితాలు మీకు కూడా తెలుసు. ఒకవేళ మీరు విశ్రాంతి తీసుకోవాలనుకుంటే ఐపీఎల్ సమయంలో విశ్రాంతి తీసుకోండి. ఎప్పుడైనా దేశానికి తొలి ప్రాధాన్యం ఇవ్వడం నేర్చుకోండి. ఐసీసీ టోర్నీల్లో కప్ గెలవాలన్న లక్ష్యంతో ఆడకపోతే జాతీయ క్రికెట్ ప్రమాణాలు పాతాళానికి దిగజారతాయి" అంటూ మదన్ లాల్ కఠిన వ్యాఖ్యలు చేశారు. 

టీమిండియా సరైన మార్గంలో పయనిస్తున్నట్టుగా అనిపించడంలేదని, గత రెండేళ్లుగా జట్టులో గెలవాలన్న తీవ్రత లోపించిందని విమర్శించారు.

More Telugu News