ఉక్రెయిన్ పై సైనిక చర్య ఇప్పట్లో ముగియదు: పుతిన్

  • రష్యా మానవ హక్కుల మండలి సమావేశంలో మాట్లాడిన పుతిన్ 
  • ఎవరిపైనా మొదటగా అణుబాంబు వేయబోమని వెల్లడి
  • ఎవరైనా అణుదాడి చేస్తే ప్రతిగా అణుదాడి చేస్తామని స్పష్టీకరణ
రష్యా మానవ హక్కుల మండలి వార్షిక సమావేశంలో దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రసంగించారు. ఉక్రెయిన్ పై సైనిక చర్య ఇప్పట్లో ముగియదని స్పష్టం చేశారు. ప్రస్తుతం అణ్వస్త్రాలను ఉపయోగించే స్థాయిలో పరిణామాలు ఆందోళనకరంగా మారుతున్నాయని పుతిన్ పేర్కొన్నారు. అయితే అణ్వస్త్రాలు ఎప్పుడు ప్రయోగించాలన్న దానిపై తమకు నియంత్రణ ఉందని అన్నారు.  

తాము ఎట్టి పరిస్థితుల్లోనూ మొదటగా అణ్వాయుధాలను వాడబోమని, ఒకవేళ తమపై ఎవరైనా అణుదాడికి పాల్పడితే కచ్చితంగా అణ్వస్త్రం ప్రయోగిస్తామని చెప్పారు. అణుదాడి పేరిట తాము ఎవరినీ బెదిరించడంలేదని, అణ్వస్త్రాల పట్ల తమకు అవగాహన ఉందని తెలిపారు. తమ వద్ద అత్యాధునిక అణ్వాయుధాలు ఉన్నాయని, అయితే తమ అణ్వాయుధాలేవీ విదేశాల్లో లేవని పుతిన్ స్పష్టం చేశారు. అమెరికా మాత్రం తన అణ్వాయుధాలను టర్కీలో ఉంచిందని ఆరోపించారు. 

కాగా, పుతిన్ వ్యాఖ్యలను అమెరికా ఖండించింది. అణ్వాయుధాలపై రష్యా ఇష్టానుసారం మాట్లాడుతోందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ పేర్కొన్నారు. రష్యా వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంతో కూడుకున్నవని విమర్శించారు.


More Telugu News

Vladimir Putin Nuclear Weapons Russia USA Ukraine