పట్టాలు దాటుతుంటే దూసుకొచ్చిన రైలు.. ప్లాట్ ఫాంకు, పట్టాలకు మధ్య నక్కిన తల్లీకొడుకులు.. వీడియో ఇదిగో!

  • ప్రాణాలతో బయటపడడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు
  • కర్ణాటకలోని కులబుర్గి స్టేషన్ లో కొద్దిలో తప్పిన ఘోర ప్రమాదం
  • కన్నీటి పర్యంతమైన తల్లిని హత్తుకుపోయిన కొడుకు
కర్ణాటకలోని కులబుర్గి రైల్వే స్టేషన్ లో కొద్దిలో ఘోర ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో తల్లీకొడుకులు ఇద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. పట్టాలు దాటుతుండగా రైలు వేగంగా దూసుకురావడంతో ప్లాట్ ఫాంకు పట్టాలకు మధ్య నక్కి కూర్చుని ప్రాణాలు కాపాడుకున్నారు. రైలు వెళ్లిపోయిన తర్వాత తల్లీకొడుకులు క్షేమంగా ఉండడంతో అక్కడున్న వాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు. 

కులబుర్గి రైల్వే స్టేషన్ లో తన కొడుకుతో కలిసి ఓ మహిళ పట్టాలు దాటుతోంది. అవతలివైపున్న ప్లాట్ ఫాం పైకి వెళ్లేందుకు పట్టాలపై నుంచి ఇద్దరూ నడుచుకుంటూ వెళ్లారు. అయితే, పట్టాలపై నుంచి ప్లాట్ ఫాం పైకి ఎక్కుతుండగా రైలు దూసుకొచ్చింది. దీంతో తల్లీకొడుకులు ఇద్దరూ ప్లాట్ ఫాం, పట్టాల మధ్య ఉన్న కొద్ది జాగాలో ఊపిరి బిగబట్టి కదలకుండా నక్కి కూర్చున్నారు.

హఠాత్తుగా జరిగిన ఈ ఘటనతో ప్లాట్ ఫాం పైనున్న ప్రయాణికులు ఆందోళనతో అక్కడ గుమిగూడారు. ఆ తల్లీకొడుకులకు ఏమైందోనని టెన్షన్ పడ్డారు. రైలు వెళ్లిపోయాక లేచి నిలబడ్డ కొడుకు తల్లిని హత్తుకుని అలాగే ఉండిపోయాడు. ఆ తల్లి కూడా షాక్ నుంచి తేరుకుని కన్నీటిపర్యంతమయ్యారు.

Train Accident
Karnataka
mother and son
safe
train track

More Telugu News