Shradha Walker: శ్రద్ధ వాకర్ హత్యకు అసలు కారణం వెల్లడించిన ఆఫ్తాబ్

  • ఢిల్లీలో శ్రద్ధ వాకర్ హత్య
  • 35 ముక్కలు చేసి ఫ్రిజ్ లో దాచిన ఆఫ్తాబ్ 
  • అనంతరం వివిధ ప్రాంతాలలో విసిరేసిన వైనం 
  • పోలీసుల అదుపులో ఆఫ్తాబ్
  • ఇటీవల నార్కో అనాలిసిస్ టెస్టు
  • నిజాలు బయటపెట్టిన ఆఫ్తాబ్
Aftab reveals reason behind Shardha Walker murder

ఢిల్లీలో శ్రద్ధ వాకర్ హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఆఫ్తాబ్ అనే యువకుడితో సహజీవనం చేస్తున్న శ్రద్ధ చివరికి ప్రియుడి చేతిలోనే కడతేరిపోయింది. శ్రద్ధను హత్య చేసిన ఆఫ్తాబ్ ఆమెను 35 ముక్కలుగా చేసి, వాటిని సుమారు మూడు వారాల పాటు ఫ్రిజ్ లో దాచి, అనంతరం నగరంలోని వివిధ ప్రాంతాలలో విసిరేసిన వైనం సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఆఫ్తాబ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల అతడికి పోలీసులు నార్కో అనాలిసిస్ టెస్టు నిర్వహించారు. 

ఈ విచారణలో ఆఫ్తాబ్ హత్య వెనుక ఉన్న అసలు విషయాన్ని బయటపెట్టాడు. మరో అబ్బాయితో ఒక రాత్రంతా గడిపినందునే శ్రద్ధను హత్య చేశానని పోలీసులకు తెలిపాడు. డేటింగ్ యాప్ బంబుల్ ద్వారా శ్రద్ధకు ఓ కుర్రాడితో పరిచయం ఏర్పడిందని, అతడిని కలిసేందుకు మే 17వ తేదీన గురుగ్రామ్ వెళ్లిందని వెల్లడించాడు. ఆ రోజు రాత్రంతా అక్కడే ఉన్న శ్రద్ధ మరుసటి రోజు మధ్యాహ్నానానికి ఫ్లాట్ కు తిరిగొచ్చిందని ఆఫ్తాబ్ వివరించాడు. దాంతో తామిద్దరి మధ్య ఈ విషయంలో గొడవ జరిగిందని తెలిపాడు. మాటామాటా పెరగడంతో క్షణికావేశంలో ఆమెను హత్య చేశానని చెప్పాడు. 

అయితే, ఆఫ్తాబ్ చెప్పిన విషయాలు నిజమా? కాదా? అన్నది తెలుసుకునేందుకు పోలీసులు శ్రద్ధ ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. అతడు చెప్పింది నిజమేనని గుర్తించారు. బంబుల్ యాప్ ద్వారా ఓ యువకుడితో పరిచయం, అతడితో ఒక రోజంతా గడపడం పోలీసుల విచారణలో నిర్ధారణ అయ్యాయి. 

శ్రద్ధాతో గడిపిన ఆ యువకుడి వివరాలను సేకరించిన పోలీసులు, అతడి పేరును బయటపెట్టలేదు. కాగా, శ్రద్ధ, తాను ఓ దశలో కేవలం రూమ్మేట్స్ లాగే ఉండేవాళ్లమని, కొంతకాలంగా తమ మధ్య శారీరక సంబంధం కూడా లేదని ఆఫ్తాబ్ నార్కో టెస్టులో వెల్లడించాడు.

More Telugu News