Bisleri: అమ్మకానికి 'బిస్లరీ'.. రేసులో టాటా గ్రూప్!

  • బిస్లరీని అమ్మేస్తున్నామని ఆ సంస్థ చైర్మన్ రమేశ్ చౌహాన్ వెల్లడి
  • పలు సంస్థలతో చర్చలు జరుపుతున్నామన్న చౌహాన్
  • తన కూతురుకి బిజినెస్ హ్యాండిల్ చేయడం ఇష్టం లేదని వ్యాఖ్య
Bisleri for sale

ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సంస్థ 'బిస్లరీ' అమ్మకానికి వచ్చింది. ఈ విషయాన్ని ఈ సంస్థ ఛైర్మన్ రమేశ్ చౌహాన్ వెల్లడించారు. బిస్లరీ అమ్మకానికి సంబంధించి ఇప్పటికే పలు సంస్థలతో చర్చలు జరపుతున్నామని తెలిపారు. ఈ సంస్థల్లో టాటా గ్రూప్ కూడా ఉందని వెల్లడించారు. అయితే, టాటా కన్జ్యూమర్ ప్రాడక్ట్స్ లిమిటెడ్ సంస్థతో ఇప్పటికే రూ. 7 వేల కోట్లకు డీల్ పూర్తయిందనే వార్తలను ఆయన ఖండించారు. చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. పూర్తి వివరాలను ఇప్పుడే వెల్లడించలేనని తెలిపారు. 

వ్యాపారాన్ని ఎవరో ఒకరు చూసుకోవాల్సి ఉంటుందని... తన కూతురు జయంతికి బిజినెస్ హ్యాండిల్ చేయడం ఇష్టం లేదని 82 ఏళ్ల చౌహాన్ చెప్పారు. 1993లో తమ సాఫ్ట్ డ్రింక్స్ బిజినెస్ ను అమెరికాకు చెందిన కోకకోలా కంపెనీకి చౌహాన్ అమ్మేశారు. చౌహాన్ సాఫ్ట్ డ్రింక్స్ బ్రాండ్స్ లో థమ్సప్, గోల్డ్ స్పాట్, సిట్రా, మాజా, లిమ్కా ఉన్నాయి. ఈ బ్రాండ్స్ లో థమ్సప్ ఇప్పటికే బిలియన్ డాలర్స్ బ్రాండ్ గా ఎదిగింది. 2024 కల్లా మాజాను కూడా బిలియన్ డాలర్స్ బ్రాండ్ గా తీర్చి దిద్దాలని కోకకోలా లక్ష్యంగా పెట్టుకుంది. 

మరోవైపు 2016లో చౌహాన్ మరోసారి సాఫ్ట్ డ్రింక్స్ బిజినెస్ లోకి దిగారు. 'బిస్లరీ పీఓపీ' బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి అడుగుపెట్టారు. అయితే, గతంలో మాదిరి ఆయన విజయం సాధించలేకపోయారు.

More Telugu News