Pavala Shyamala: ఏ హీరోలు నాకు లక్షలకి లక్షలు ఇవ్వలేదు.. అదంతా పుకారే: సీనియర్ నటి పావలా శ్యామల

  • నాటకరంగం నుంచి వచ్చిన 'పావలా శ్యామల'
  •  చాలా సీరియల్స్ లో గుర్తుండిపోయే పాత్రలు 
  • సినిమాల్లోను విభిన్నమైన పాత్రలు 
  • అనారోగ్య, ఆర్థికపరమైన సమస్యలతో సతమతం  
Pavala Shyamala Interview

తెలుగు తెరకి నాటకరంగం నుంచి వచ్చిన ఆర్టిస్టులలో 'పావలా' శ్యామల ఒకరు. 'పావలా' అనే నాటకం ఆమెకి పేరు తీసుకుని రావడం వలన, అది ఆమె ఇంటి పేరుగా మారిపోయింది. ఆ తరువాత ఆమె టీవీ సీరియల్స్ లోను .. సినిమాల్లోను చేస్తూ వెళ్లారు. శ్యామలకి ఏ పాత్రను ఇచ్చినా తనదైన మార్కు స్పష్టంగా వేస్తారు. పాత్ర ఏదైనా తనదైన విరుపులు .. వెటకారాలు చూపించడం ఆమె ప్రత్యేకత. 


అలాంటి ఆమెకి ఈ మధ్య కాలంలో వేషాలు రావడం లేదు. అందుకు కారణం ఆమెకి వయసు పైబడటం. ఆమె కూతురు అనారోగ్యం బారిన పడటం. తాజా ఇంటర్వ్యూలో శ్యామల మాట్లాడుతూ .. " నేను కష్టాల్లో ఉన్నప్పుడు చిరంజీవి గారు నన్ను ఆదుకున్నారు. తనే నాకు 'మా'లో సభ్యత్వాన్ని ఇప్పించి, ప్రతినెలా నాకు కొంత మొత్తం వచ్చేలా చేశారు. ఆయన చేసిన సాయాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను. 

అయితే మహేశ్ బాబు .. ఎన్టీఆర్ .. ప్రభాస్ .. చరణ్ వీరంతా కూడా తలా పది లక్షలు నాకు సహాయం చేసినట్టుగా .. నేను హాయిగా ఉన్నట్టుగా ఎవరో ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అందులో ఎంతమాత్రం నిజం లేదు. అలాంటి పుకార్ల వలన నాకు చిన్న చిన్న సాయాలు చేసేవారు కూడా వెనక్కి పోయారు. నాకు ఎలాంటి సాయం దక్కకూడదనే ఉద్దేశంతో ఒక మహాతల్లి ఇలా చేసింది" అంటూ ఆమె ఆవేదనను వ్యక్తం చేశారు.

More Telugu News