IAS: కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు విచారణకు హాజరైన ఏపీ ఐఏఎస్ లు

  • ఉపాధి హామీ బిల్లుల చెల్లింపుల అంశంలో కోర్టు ధిక్కరణ కేసు
  • కోర్టుకు వచ్చిన నలుగురు ఐఏఎస్ లు
  • పిటిషనర్లకు వ్యయం పెరుగుతోందన్న హైకోర్టు
  • ఎందుకు ఏడాది జాప్యం చేశారని ప్రశ్నించిన ధర్మాసనం
Four AP IAS officers attends high court hearing

ఏపీకి చెందిన ఉన్నతాధికారులు కోర్టుకు హాజరవుతున్న ఘటనలు ఇటీవల కాలంలో తరచుగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, ఉపాధి హామీ పథకం బిల్లుకు సంబంధించి కోర్టు ధిక్కరణ కేసులో నలుగురు ఐఏఎస్ అధికారులు నేడు హైకోర్టుకు వచ్చారు. గోపాలకృష్ణ ద్వివేది, రావత్, కోన శశిధర్, వివేక్ యాదవ్ నేడు న్యాయస్థానంలో విచారణకు హాజరయ్యారు. 

ఏడాది క్రితం బిల్లుల చెల్లింపు ఆదేశాలను పట్టించుకోలేదంటూ వీరిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదైంది. నేటి విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపించారు. న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పట్ల ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ హైకోర్టు ధర్మాసనం ఐఏఎస్ అధికారులను ప్రశ్నించింది. పిటిషనర్లకు వ్యయం పెరుగుతోందని వెల్లడించింది. 

కాగా, ఇవాళ విచారణ ఉందని తెలిసి, బిల్లుల చెల్లింపులను రెండ్రోజుల కిందట ఖాతాలో వేశారని హైకోర్టు ఆక్షేపించింది. ఏడాది జాప్యంపై సరైన వివరణ ఇవ్వాలని నలుగురు అధికారులను ఆదేశించింది. అనంతరం, తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

More Telugu News