Balweer: హెలికాప్టర్ శబ్దంతో తన గేదె చనిపోయిందంటూ పైలెట్ పై ఫిర్యాదు చేసిన గ్రామస్థుడు

  • రాజస్థాన్ లో విడ్డూరం
  • గేదె మృతికి హెలికాప్టర్ కారణం అంటున్న వృద్ధుడు
  • తన గేదె విలువ రూ.1.5 లక్షలని వెల్లడి
  • పైలెట్ పై చర్యలు తీసుకోవాలని వినతి
  • గేదెకు పోస్టుమార్టం
Villager alleges his buffalo died because of Helicopter sound

రాజస్థాన్ లో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. తమ గ్రామం మీదుగా హెలికాప్టర్ వెళ్లిందని, ఆ హెలికాప్టర్ శబ్దంతో తన గేదె చనిపోయిందని ఓ గ్రామస్థుడు ఆరోపిస్తున్నాడు. అంతేకాదు, ఆ హెలికాప్టర్ పైలెట్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

అసలేం జరిగిందంటే.... రాజస్థాన్ లోని అల్వార్ జిల్లా బహ్రోద్ నియోజకవర్గ శాసనసభ్యుడు బల్జీత్ యాదవ్ ఇటీవల ఓ గ్రామంలో పర్యటించారు. కొందరు కార్యకర్తలు అత్యుత్సాహంతో తమ ఎమ్మెల్యేపై ఆకాశం నుంచి పూలవర్షం కురిపించేందుకు హెలికాప్టర్ ను వినియోగించారు. 

ఎమ్మెల్యే పర్యటనకు వచ్చిన సమయంలో పూలవర్షం కురిపించిన ఆ లోహవిహంగం, కొంతసేపు అక్కడే చక్కర్లు కొట్టి కొహ్రానా అనే గ్రామం మీదుగా తక్కువ ఎత్తు నుంచి వెళ్లిపోయింది. 

అయితే, బల్వీర్ అనే వృద్ధుడికి చెందిన గేదె ఒకటి ఆ సమయంలో మృతి చెందింది. హెలికాప్టర్ భారీ శబ్దం చేసుకుంటూ వెళ్లడం వల్లే తన గేదె చనిపోయిందని ఆ వృద్ధుడు చెబుతున్నాడు. తన గేదె విలువ రూ.1.5 లక్షలు ఉంటుందని, పైలెట్ ను అరెస్ట్ చేసి తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. 

ప్రస్తుతం పోస్టుమార్టం నిమిత్తం ఆ గేదెను వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. గేదె ఎందుకు చనిపోయిందన్నది పోస్టుమార్టం రిపోర్టు ద్వారా తెలుస్తుందని, ఒకవేళ హెలికాప్టర్ శబ్దం వల్లే చనిపోయినట్టయితే అప్పుడు కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.

More Telugu News