Kakani Govardhan Reddy: రామోజీరావు వంటి వ్యక్తి కూడా దిగజారి అసత్య ప్రచారం చేస్తున్నారు: కాకాణి గోవర్ధన్

  • నారా లోకేశ్ వ్యవసాయం గురించి మాట్లాడటం మన ఖర్మ అన్న గోవర్ధన్ 
  • చంద్రబాబు హయాంలో కరవు విలయతాండవం చేసిందని వ్యాఖ్య 
  • వ్యవసాయాన్ని పండుగ చేసి చూపిస్తామని స్పష్టీకరణ 
Kakani Govardhan comments on Ramoji Rao

టీడీపీ నేత నారా లోకేశ్ వ్యవసాయం గురించి మాట్లాడటం మన ఖర్మ అని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ ఎద్దేవా చేశారు. జనసేనాని పవన్ కల్యాణ్ బుడబుక్కల వేషం వేస్తున్నారని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ రాష్ట్రానికి రాహువు, కేతువుల్లా దాపురించారని అన్నారు. చంద్రబాబు పాలనలో కరవు విలయతాండవం చేసిందని... ఎన్నో మండలాలు కోరల్లో చిక్కుకున్నాయని చెప్పారు. రాష్ట్రంలోని చెరువులు, జలాశయాలు ఎడారులను తలపించాయని అన్నారు. 

జగన్ వచ్చిన తర్వాత క్రమం తప్పకుండా వర్షాలు కురుస్తున్నాయని... తాగు నీటికి, సాగు నీటికి ఎలాంటి సమస్య లేదని చెప్పారు. అయినప్పటికీ పచ్చ మీడియా ప్రభుత్వంపై తప్పుడు వార్తలు రాస్తోందని... రామోజీరావు వంటి వ్యక్తి కూడా దిగజారి అసత్య ప్రచారం చేయడం దారుణమని విమర్శించారు. పత్రికలు నైతిక విలువలను పాటిస్తూ, పారదర్శకంగా వ్యవహరిస్తూ, ప్రజలకు వాస్తవాలను తెలియజేసేలా ఉండాలని అన్నారు. రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని... వ్యవసాయాన్ని పండుగ చేసి చూపిస్తామని చెప్పారు.

More Telugu News