Ayurvedic: జలుబు, దగ్గు వున్నప్పుడు.. ఇంట్లో ఆచరించతగిన ఆయుర్వేద చికిత్సలు

  • ఇంట్లో ఉండే వాటితోనే చక్కని పరిష్కారాలు
  • పసుపు, అల్లం, వెల్లుల్లి, తులసి ఆకులు అవసరం
  • తేనె, పుదీనా, మిరియాలతో మంచి ఉపశమనం
Ayurvedic home remedies to manage cough cold and Covid

శీతాకాలంలో శ్వాసకోశ సమస్యలు ఎక్కువ. చల్లటి వాతావరణం, కాలుష్యం వల్ల జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్లు వేధిస్తుంటాయి. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వారికి వీటి ముప్పు ఎక్కువగా ఉంటుంది. దీనికితోడు కరోనా కొత్త రకాలు కూడా వ్యాప్తిలో ఉన్నాయి. దీంతో దగ్గు, జలుబు, జ్వరం కనిపిస్తే అశ్రద్ధ చేయడం సరికాదు. ఈ తరహా ఆరోగ్య సమస్యలు కనిపించిన వారు ఉపశమనం కోసం ఇంట్లో అనుసరించతగిన ఆయుర్వేద చికిత్సలను వైద్యులు సూచిస్తున్నారు. అల్లానికి యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. కనుక దీనితోపాటు, పసుపు, వెల్లుల్లి, మిరియాలు, తులసి, పుదీనా ఆకులు, మెంతులు తదితర వాటిని ఉపశమనం కోసం తీసుకోవచ్చు.

ఔషధాలు..
శొంఠి సిద్ధ జలాన్ని రోజంతా తాగొచ్చు. ఇది జీవక్రియలను మెరుగు పరుస్తుంది. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం ఇస్తుంది. దీని తయారీకి.. ఒక లీటర్ నీటికి అర స్పూన్ అల్లం పౌడర్ లేదా శొంఠి పొడి లేదంటే తాజా అల్లం కొంత చేర్చి పది నిమిషాల పాటు మధ్యస్థ మంటపై స్టవ్  మీద పెట్టాలి. ఆ తర్వాత దించేసి, ద్రావకం వేడి గది వాతావరణానికి రానివ్వాలి. ఈ జలాన్ని స్టీల్ పాత్ర లేదా బాటిల్ లో పోసుకోవాలి. 

అర టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ అల్లం పౌడర్, ఒక మిరియం లేదా పావు టీ స్పూన్ మిరియాల పొడి, ఒక టీ స్పూన్ తేనె కలిపి రోజులో రెండు మూడు సార్లు తీసుకోవచ్చు. ఆహారం తీసుకోవడానికి గంట ముందు లేదా గంట తర్వాత తీసుకోవచ్చు.

ఆవిరి పట్టడం..
రెండు గ్లాసుల నీటిని తీసుకోవాలి. కొన్ని తులసి ఆకులు, 5-7 పుదీనా ఆకులు వేయాలి. ఒక టీ స్పూన్ వాము, అర టీ స్పూన్ మెంతులు వేయాలి. అలాగే, అర టీ స్పూన్ పసుపు కూడా వేసి మధ్యస్థాయి మంటపై 7-10 నిమిషాల పాటు మరగనివ్వాలి. ఈ కషాయంతో రోజుకు రెండు సార్లు ఆవిరి పడితే సరి. 

ఒక గ్లాస్ నీరు తీసుకుని, దానికి ఒక టీ స్పూన్ పసుపు కలిపి 3-5 నిమిషాలు బాయిల్ చేయాలి. గోరు వెచ్చగా మారిన తర్వాత, ద్రావకంతో రోజుకు మూడు సార్లు పుక్కిలి పట్టి గార్గిల్ చేయాలి. ఈ చికిత్సలు ఎవరైనా చేసుకోవచ్చని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

More Telugu News