FASTag: ఎన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తే.. అంతే టోల్ చార్జీ.. త్వరలో కొత్త విధానం

  • ఫాస్టాగ్ స్థానంలో శాటిలైట్ నేవిగేషన్ సిస్టమ్
  • వాహనాల్లో ఇందుకు సంబంధించిన పరికరాల ఏర్పాటు
  • ఈ విధానంపై ప్రస్తుతం ప్రయోగాత్మక పరీక్షలు
FASTag system will end soon Satellite navigation system will come

వాహనదారులకు శుభవార్త. త్వరలోనే కొత్త టోల్ వసూలు విధానం అమల్లోకి రానుంది. ఇప్పుడు నడుస్తున్న ఫాస్టాగ్ విధానం మారిపోనుంది. ప్రస్తుతం ఫాస్టాగ్ విధానంలో ఒక టోల్ ప్లాజా వద్ద వాహనం క్రాస్ చేస్తున్న సమయంలో ఆర్ఎఫ్ఐడీ స్కాన్ ద్వారా సదరు వాహన నంబర్ కు అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతా నుంచి బ్యాలన్స్ డెబిట్ అయిపోతోంది. కానీ, కొత్త విధానంలో అలా కాదు.

ఒక టోల్ ప్లాజా క్రాస్ చేసిన తర్వాత కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఆగిపోతే ఏంటి? అంత చార్జీ చెల్లించడం అనవసరం కదా? కొత్త విధానంలో టోల్ ప్లాజా క్రాస్ చేసిన తర్వాత మూడు కిలోమీటర్ల దూరంలో ఆగిపోతే, అంత వరకే టోల్ చార్జీ వసూలు చేస్తారు. శాటిలైట్ నేవిగేష్ సిస్టమ్ (జీపీఎస్) ఆధారంగా వాహనం ఎంత దూరం వెళ్లి ఆగిపోయిందన్నది సిస్టమ్ ఆటోమేటిగ్గా గుర్తించి, చార్జీని సదరు వాహనదారుని ఖాతా నుంచి డెబిట్ చేసుకుంటుంది. ఒక టోల్ రోడ్డుపైకి వాహనం ఎన్నో కిలోమీటర్ వద్ద ప్రవేశించి, ఎన్నో కిలోమీటర్ వద్ద ముగించిందన్నది నూతన విధానంలో గుర్తించి చార్జీ వసూలు చేస్తారు. దీనివల్ల వాహనదారులకు చాలా ఆదా అవుతుంది. 

జర్మనీ, రష్యా తదితర దేశాల్లో ఈ విధానంలోనే టోల్ చార్జీ వసూళ్లు అమల్లో ఉన్నాయి. దీన్ని మన దేశంలోనూ అమలు చేయాలన్నది కేంద్ర సర్కారు ప్రయత్నం. ప్రస్తుతం ప్రయోగాత్మక పరీక్షలో ఉంది. ఇందుకోసం వాహనాల్లో శాటిలైట్ నేవిగేషన్ సిస్టమ్ పరికరాలను అమర్చాల్సి ఉంటుంది. ఇందుకోసం మోటారు వాహన చట్టంలోనూ సవరణలు కూడా అవసరం అవుతాయి.

More Telugu News