KA Paul: 155 దేశాల్లో తిరిగినా దొరకని ప్రేమ నాకు ఇక్కడ దొరికింది: కేఏ పాల్

  • మునుగోడులో 50 వేల మెజార్టీతో గెలుస్తానన్న కేఏ పాల్
  • మునుగోడు మహిళలు, యువత తనపై ఎంతో ప్రేమను చూపించారని వ్యాఖ్య
  • తనకు గన్ మెన్లను కూడా ఇవ్వలేదని మండిపాటు
I found love here that I couldnt find in 155 countries says KA Paul

మునుగోడు ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ప్రజాశక్తి పార్టీ అధినేత కేఏ పాల్ మండిపడ్డారు. రెండు ప్రధాన పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేశాయని... అయినప్పటికీ ఆ పార్టీలకు గెలిచే పరిస్థితి లేదని చెప్పారు. పోలీసులు తమను ఇబ్బందులకు గురి చేశారని... జిల్లా ఎస్పీ కూడా టీఆర్ఎస్ కు ఏజెంట్ మాదిరి వ్యవహరించారని ఆరోపించారు. తనకు కనీసం గన్ మెన్లను కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. గద్దర్ కు గన్ మెన్లను ఇచ్చారని, తనకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.  

మునుగోడులో గెలుపు తనదే అని కేఏ పాల్ చెప్పారు. 50 వేల ఓట్ల మెజార్టీతో తాను గెలవబోతున్నానని అన్నారు. మునుగోడు మహిళలు, యువత తనపై ఎంతో ప్రేమను చూపించారని చెప్పారు. 155 దేశాల్లో తిరిగినా దక్కని ప్రేమ తనకు మునుగోడులో లభించిందని అన్నారు. ప్రచారం సమయంలో తనపై మూడు సార్లు దాడులకు యత్నించారని... రిటర్నింగ్ అధికారితో పాటు ఇతర అధికారులు తనను రక్షించారని చెప్పారు. 

ఎమ్మెల్యేల కొనుగోలు అంశం మొత్తం ఒక డ్రామా అని పాల్ అన్నారు. బీజేపీలో చేరితే తనకు మంత్రి పదవి ఇస్తానని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆఫర్ ఇచ్చారని చెప్పారు. బీజేపీ తనకు పరోక్షంగా మద్దతును ఇచ్చిందని, కాంగ్రెస్ నేరుగా మద్దతును ప్రకటించిందని... అందువల్ల గెలిచేది తానేనని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News