అసత్య ప్రచారాన్ని ఆపకపోతే చట్ట పరంగా చర్యలు తీసుకుంటా: మంత్రి కొప్పుల‌

  • తనను కేసీఆర్ అవమానించారని అసత్య ప్రచారం చేస్తున్నారన్న మంత్రి 
  • టీఆర్ఎస్ కుటుంబానికి కేసీఆర్ తండ్రిలాంటి వారని వ్యాఖ్య 
  • కుటుంబ సభ్యులను సంబోధించినట్టే తనను కూడా సంబోధించారని వివరణ 
బీజేపీ, కాంగ్రెస్ నేతలపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. వాస్తవాలు తెలుసుకోకుండా అసత్యాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నిన్న ప్రగతి భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మంత్రులను ఒక వైపు, ఎమ్మెల్యేలను మరోవైపు కూర్చోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని... తాను ఎమ్మెల్యేల వరుసలో కూర్చోవడంతో మంత్రుల వైపు కూర్చోవాలని ముఖ్యమంత్రి సూచించారని అన్నారు. ఈ విషయాన్ని తెలుసుకోకుండా... మంత్రికి, దళిత సమాజానికి అవమానం జరిగిందంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. 

టీఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబమని...కేసీఆర్ కుటుంబానికి తండ్రిలాంటి వారని... కుటుంబ సభ్యులను సంబోధించినట్టుగానే తనను సంబోధించారని చెప్పారు. హరీశ్ రావు కూడా పక్కకు జరిగి తనకు కుర్చీ ఇచ్చారని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు బురద చల్లే కార్యక్రమాన్ని మానుకోవాలని... లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

Koppula Eshwar
KCR
TRS
BJP
Congress

More Telugu News