apple company: యాపిల్ కంపెనీలో 140 కోట్లు కొట్టేసిన ఉద్యోగి

  • ఏడేళ్ల పాటు సంస్థను మోసం చేసిన వైనం
  • ఉద్యోగం మానేశాక నాలుగేళ్లకు పశ్చాత్తాపం
  • పోలీసుల ముందు లొంగిపోయిన భారత సంతతి వ్యక్తి
  • మరో ఇద్దరు ఉద్యోగులు సహకరించారని వెల్లడి
apple employee cheats firm for 140 crores

తిండి పెడుతున్న కంపెనీని మోసం చేశాడో ఉద్యోగి.. ఒకటి, రెండుసార్లు కాదు, ఏకంగా ఏడేళ్లపాటు మోసం చేస్తూనే ఉన్నాడు. మరో ఇద్దరితో జత కలిసి పక్కాగా దొంగతనం చేస్తూ వచ్చాడు. ఇలా ఏడేళ్లలో మొత్తం రూ.140 కోట్లను వాళ్లు కాజేశారు. దొంగతనం బయటపడడంతో ఆ ఘరానా దొంగ ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నాడు. ఈ ఘరానా దొంగతనం అమెరికాలోని యాపిల్ కంపెనీలో చోటుచేసుకుంది. 

భారత సంతతికి చెందిన ధీరేంద్ర ప్రసాద్ కాలిఫోర్నియాలోని యాపిల్ కంపెనీలో 2008లో చేరాడు. మూడేళ్ల తర్వాత సంస్థలో దొంగతనం చేయడం మొదలు పెట్టాడు. దొంగ ఇన్వాయిస్ లు తయారు చేయడం, విలువైన ఎలక్ట్రానిక్ విడిభాగాలను కొట్టేయడం, వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేయడం వంటివి చేశాడు. వచ్చిన సొమ్మును తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. 2011 నుంచి 2018 వరకు ఇలా దాదాపు 17 మిలియన్ డాలర్లు (మన రూపాయల్లో 140 కోట్ల పైనే) కంపెనీ నుంచి కాజేశాడు.

ధీరేంద్ర ప్రసాద్ 2018 లో ఉద్యోగానికి రాజీనామా చేసి యాపిల్ సంస్థ నుంచి బయటికొచ్చాడు. నాలుగేళ్ల తర్వాత తను చేసిన మోసానికి పశ్చాత్తాపంతో ఇటీవల పోలీసుల ముందు లొంగిపోయాడు. ఈ మోసంలో తనతో పాటు మరో ఇద్దరు ఉన్నారని పోలీసులకు వెల్లడించాడు. దీంతో ధీరేంద్రతో పాటు యాపిల్ కంపెనీలో ఉద్యోగం చేసిన రాబర్ట్ గేరీ హన్సన్, డాన్ ఎమ్ బేకర్ లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురిపైనా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రసాద్ కేసు విచారణ వచ్చే ఏడాది మార్చిలో జరగనుంది.

More Telugu News