మంచి సమాజాన్ని తీసుకురావాలంటే నేనేం చేయాలన్న ఆలోచనే నన్ను రాజకీయాల దిశగా నడిపించింది: పవన్ కల్యాణ్
- మంగళగిరి విచ్చేసిన పవన్ కల్యాణ్
- విశాఖ నేతలతో ఆత్మీయ సమావేశం
- తన ఒక్కడి వల్లే అద్భుతాలు జరుగుతాయని భావించనని వెల్లడి
"నా పిల్లలకు నేను మంచి విద్య ఇవ్వగలను, డబ్బులు ఇవ్వగలను, మంచి ఇల్లు, దుస్తులు, ఇతర సౌకర్యాలు ఇవ్వగలను. కానీ వారు బతికేందుకు మంచి సమాజం తీసుకురావాలంటే నేనేం చేయాలన్న ఆలోచనే నన్ను రాజకీయాల వైపు నడిపించింది" అని పవన్ కల్యాణ్ వెల్లడించారు.
మంచి ఆలోచనలతో కూడిన బలమైన సమూహాన్ని తయారుచేసేందుకు జనసేన పార్టీని ఓ వేదికగా నిర్మించినట్టు వివరించారు. నెల్లూరులో చదువుకుంటున్నప్పుడు... చట్టం ఒకరికే ఎందుకు బలంగా పనిచేస్తుంది అన్న ఆలోచనల నుంచి పుట్టిన తన పయనం ఇవాళ ఒక బలమైన ఆలోచనల సమూహాన్ని తయారుచేసిందని తెలిపారు.
కాగా, ఎన్నికల అనంతరం తాను పార్టీ ఆఫీసులో కూర్చున్న సమయంలో ఓ మహిళ వచ్చి కలిసిందని పవన్ వెల్లడించారు. "తన 14 ఏళ్ల కుమార్తెను అత్యాచారం చేసి చంపేశారని ఆమె తెలిపింది. ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోలేదని చెబుతూ, అత్యాచార ఘటనకు సంబంధించిన అన్ని వివరాలను నాతో పంచుకుంది. అది నన్ను మరింత కదిలించివేసింది. ఇంటి నుంచి స్కూలుకు వెళ్లిన బిడ్డకు తగిన రక్షణ లేనప్పుడు, మనం ఏంచేయలేని నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు వచ్చే కోపం మాటల్లో చెప్పలేనిది. ఈ వ్యవస్థల పరిస్థితి చూసి ఎన్నిసార్లు నాలో నేను దహించుకుపోయానో నాకు తెలుసు. పోరాటమే మార్గం అని భావించాను" అని ఉద్ఘాటించారు.