Telangana: టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో ఎఫ్​ఐఆర్... కీలక విషయాలు వెల్లడి

  • ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదుతో ముగ్గురిపై మొయినాబాద్ పీఎస్ లో కేసు
  • రోహిత్ చెప్పిన విషయాలను ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న పోలీసులు
  • తమకు ఒక్కొక్కరికి రూ. 100 కోట్లు ఆఫర్ చేసినట్టు చెప్పిన రోహిత్ రెడ్డి
Cops allege attempt to poach MLAs Case key details in FIR

టీఆర్ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి (తాండూరు), గువ్వల బాలరాజు (అచ్చంపేట), హర్షవర్దన్ రెడ్డి (కొల్లాపూర్), రేగా కాంతారావు (పినపాక)లను పార్టీ మారాలంటూ కొందరు ప్రలోభాలకు గురిచేశారన్న ఆరోపణలతో పోలీసులు బుధవారం ముగ్గురిని అరెస్ట్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. మొయినాబాద్ లో ఓ ఫాం హౌస్ లో నలుగురు ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుపుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు ప్రకటించారు. అరెస్టు చేసిన ముగ్గురిపై తాజాగా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదు మేరకు ప్రజా ప్రతినిధులను ప్రలోభ పెట్టినందుకు వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్ లపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. 

రోహిత్ రెడ్డి ఫిర్యాదులో చెప్పిన విషయాలను ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. పార్టీ మారితే ఒక్కొక్కరికి రూ. 100 కోట్ల ఆఫర్ చేస్తూ తమను సంప్రదించారని రోహిత్ రెడ్డి చెప్పారు. నందకుమార్ మధ్యవర్తిత్వంలో రామచంద్ర భారతి, సింహయాజులు ఫాం హౌస్ లో తమను కలిశారని తెలిపారు. పార్టీ మారితే డబ్బుతో పాటు సివిల్ కాంట్రాక్టులు, కేంద్ర ప్రభుత్వంలో పదవులు ఇస్తామని, లేదంటే సీబీఐ, ఈడీ కేసులు పెట్టి వేధిస్తామని బెదిరించినట్టు చెప్పారు. కాగా, అరెస్టు చేసిన ముగ్గురిని పోలీసులు విచారిస్తున్నారు. వారి సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మొయినాబాద్ ఫాం హౌస్ లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఫాం హౌస్ లోకి ఎవ్వరినీ అనుమతించడం లేదు. అరెస్ట్ చేసిన ముగ్గురిని కాసేపట్లో కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నారని సమాచారం.

More Telugu News