Beggar: ఆలయ అన్నదానానికి లక్ష రూపాయల విరాళమిచ్చిన యాచకురాలు

  • మంగళూరు శివారులోని శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయానికి లక్ష విరాళం
  • ఇప్పటి వరకు 9 సార్లు వివిధ ఆలయాలకు లక్ష చొప్పున విరాళం అందించిన అశ్వత్థమ్మ
  • శబరిమల ఆలయానికి లక్షన్నర విరాళం
  • 18 ఏళ్ల క్రితం భర్త, పిల్లలను కోల్పోయిన అశ్వత్థమ్మ
80 Year Old Beggar From Mangaluru Donated Rs 1 lakh To The Temple

ఆలయంలో అన్నదానానికి లక్ష రూపాయల విరాళమిచ్చి, ఓ యాచకురాలు తన మంచి మనసును చాటుకుంది. అన్నదానానికి విరాళం ఇవ్వడం ఆమెకు ఇదేమీ కొత్తకాదు. ఇప్పటి వరకు 9 సార్లు ఆమె లక్ష రూపాయల చొప్పున 9 సార్లు ఇచ్చారు. ఆమె పేరు అశ్వత్థమ్మ. వయసు 80 సంవత్సరాలు. 

కర్ణాటకలోని ఉడుపి జిల్లా సిద్ధాపురకు చెందిన ఆమె యాచన చేస్తూ జీవితం గడుపుతోంది. భిక్షాటన ద్వారా తనకొచ్చే సొమ్ములో కొంత మిగిలిస్తూ వస్తున్న ఆమె ఇప్పటి వరకు 9 లక్షలను ఆలయాల్లో అన్నదానానికి అందించారు. తాజాగా, మంగళూరు శివారు ముల్కిలో ఉన్న బప్పనాడు శ్రీ దుర్గా పరమేశ్వరి ఆలయంలో నిర్వహిస్తున్న అన్నదానానికి రూ. లక్ష విరాళం అందించారు. అన్నదానం కోసం విరాళమిస్తున్న అశ్వత్థమ్మను ఆలయ ట్రస్టు ప్రతినిధులు సత్కరించారు.

అశ్వత్థమ్మ భర్త, పిల్లలు 18 సంవత్సరాల క్రితం మరణించారు. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లిపోయిన ఆమె జీవనం కోసం యాచకురాలిగా మారింది. సాలిగ్రామలోని గురునరసింహ దేవాలయం వద్ద భిక్షాటన చేసేది. భక్తులు ఇచ్చే సొమ్మును కూడబెడుతూ ఆ గుడికే విరాళంగా ఇచ్చారు. ఆ తర్వాత ఒకసారి అయ్యప్పమాల వేసుకుని శబరిమల వెళ్లి రూ. 1.5 లక్షలు విరాళం ఇచ్చారు. అలాగే, కుందాపుర కంచుగోడు, పొలలి శ్రీ రాజరాజేశ్వరి, అఖిలేశ్వరి ఆలయానికి విరాళాలు అందించారు. ఆలయాల్లో ఇచ్చే ప్రసాదం, భక్తులు అందించే ఆహారమే తనకు సరిపోతుందని, ఇతరుల ఆకలి బాధను తీర్చేందుకే అన్నదానం కోసం తాను విరాళాలు అందిస్తున్నట్టు అశ్వత్థమ్మ తెలిపారు.

More Telugu News