YSRCP: చెప్పుతో కొట్టడం అంటే ఏమిటో తెలుసా నీకు?: పవన్ కు మంత్రి అమర్నాథ్ ప్రశ్న

  • పవన్ వ్యాఖ్యలపై స్పందించిన అమర్నాథ్ 
  • విశాఖ గర్జనను పక్కదారి పట్టించేందుకే పవన్ యత్నమన్న మంత్రి
  • భీమవరం, గాజువాకల్లో ప్రజలు పవన్ ను ఓడించారని వెల్లడి
  • ఆ రెండు చోట్ల దక్కిన ఫలితం చెప్పు దెబ్బలు తిన్నట్టేనని వ్యాఖ్య
ap minister gudivada amarnath hits back pawan kalyan comments

తనను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నుంచి కౌంటర్లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా వైసీపీ నేత, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్... పవన్ వ్యాఖ్యలపై స్పందించారు. ప్రజాస్వామ్యంలో చెప్పుతో కొట్టడం అంటే ఏమిటో తెలుసా నీకు? అంటూ ఆయన పవన్ ను ప్రశ్నించారు. గత ఎన్నికల్లో గాజువాకలో, భీమవరంలో ప్రజలు ఇచ్చిన తీర్పు... మిమ్మల్ని చెప్పుతో కొట్టడమేనని ఆయన అన్నారు. పళ్లు రాలగొడతానన్న పవన్ వ్యాఖ్యలను ప్రస్తావించిన మంత్రి...భీమవరంలో, గాజువాకలో ప్రజలు ఇచ్చిన తీర్పు మీకు పళ్లు రాలగొట్టడమేనని తెలిపారు. 

ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షను చాటి చెప్పిన విశాఖ గర్జనను, విశాఖ రాజధాని కావాలన్న డిమాండ్ ను పక్కదారి పట్టించేందుకే పవన్ కల్యాణ్ కుటిల యత్నాలు చేస్తున్నారని అమర్నాథ్ ఆరోపించారు. పవన్ లోని ఫ్రస్ట్రేషన్ అంతా చూస్తుంటే... పవన్ ను మూడో భార్య కూడా వదిలేసి ఉంటుందని కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్య చేశారు.

ఈ సందర్భంగా మరోమారు టీడీపీ, జనసేనల మధ్య కుదురుతుందని భావిస్తున్న పొత్తును ఆయన భార్యాభర్తల సంబంధంతోనే పోల్చారు. వంగవీటి రంగా గురించి మాట్లాడే అర్హత పవన్ కు ఉందా? అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ నేతలపై జనసేన నేతలు దాడి చేస్తే... చంద్రబాబు వెళ్లి ఆ పార్టీ అధినేతను పరామర్శించడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు.

More Telugu News