Peedika Rjanna Dora: ఈ ఘటనతో పవన్ పై ఉన్న అభిమానం పోయింది: ఏపీ డిప్యూటీ సీఎం రాజన్నదొర

  • విశాఖలో వైసీపీ మంత్రులపై దాడి హేయమైన చర్య అన్న రాజన్నదొర
  • ఈ ఘటనను తేలిగ్గా తీసుకోబోమని స్పష్టీకరణ
  • కార్యకర్తలపై పవన్ నియంత్రణ కోల్పోయాడని వ్యాఖ్యలు
  • ఇకనైనా జనసైనికులను కట్టడి చేయాలని హితవు
AP Dy CM Peedika Rajanna Dora comments on Pawan Kalyan

విశాఖలో జరిగిన ఘటనలపై ఏపీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర స్పందించారు. పవన్ కల్యాణ్... చంద్రబాబు కోసమే రాజకీయాలు చేస్తున్నాడని ఆరోపించారు. పవన్ తన కార్యకర్తలపై నియంత్రణ కోల్పోయాడని, ఉత్తరాంధ్రలో రాజధాని ఏర్పాటుకు మద్దతు ఇవ్వడానికి వచ్చిన మంత్రులపై దాడిని హేయమైన చర్యగా భావిస్తున్నట్టు తెలిపారు. 

తాను ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కల్యాణ్ లను ఎంతో అభిమానిస్తానని... కానీ ఈ ఒక్క ఘటనతో పవన్ పై అభిమానం పోయిందని రాజన్నదొర వ్యాఖ్యానించారు. పవన్ ఇకనైనా తన కార్యకర్తలను కట్టడి చేయాలని అన్నారు. కార్యకర్తల్లో క్రమశిక్షణ లేకపోవడం వల్లే అధికారంలోకి రాలేకపోయామని గతంలో పవన్ చెప్పారని రాజన్నదొర ఈ సందర్భంగా గుర్తుచేశారు.  

ఏదేమైనా, విశాఖ ఎయిర్ పోర్టులో తమ మంత్రులపై దాడి ఘటనను తాము తేలిగ్గా తీసుకోవడంలేదని, ఇది ఇంతటితో పోయేది కాదని స్పష్టం చేశారు.

More Telugu News