Velagapudi Ramakrishna: పవన్ అడుగు పెట్టిన వెంటనే.. విశాఖ గర్జన గాల్లో కలిసిపోయింది: టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి

  • జైలుకు అలవాటు పడిన జగన్ అందరినీ జైలుకు పంపాలనుకుంటున్నారన్న వెలగపూడి
  • పవన్ పట్ల పోలీసులు హుందాగా వ్యవహరించలేదని వ్యాఖ్య
  • ప్రభుత్వాలు మారుతాయనే విషయాన్ని అధికారులు గుర్తు పెట్టుకోవాలని హెచ్చరిక
Visakha Garjana failed after Pawan enters Vizag says TDP MLA Velagapudi Ramakrishna

విశాఖలో జనసేన నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ మండిపడ్డారు. ఈ అరెస్టులను ఖండిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ కు జైలు జీవితం అలవాటని... అందుకే అందరినీ జైలుకు పంపాలనుకుంటున్నారని దుయ్యబట్టారు. అందుకే ఇతర పార్టీల నేతలపై అక్రమ కేసులను బనాయిస్తున్నారని చెప్పారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు కూడా సరిగా లేదని అన్నారు. వైసీపీ చేపట్టిన విశాఖ గర్జన తుస్సుమందని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ విశాఖలో అడుగు పెట్టిన వెంటనే విశాఖ గర్జన గాల్లో కలిసిపోయిందని అన్నారు. ఆ అక్కసుతోనే జనసేన నేతలపై అక్రమ కేసులు పెట్టారని చెప్పారు. పోలీసులు హుందాగా వ్యవహరించడం లేదని... ప్రభుత్వాలు మారుతాయనే విషయాన్ని కొందరు అధికారులు గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. 

మరోవైపు, విశాఖ విమానాశ్రయం వద్ద వైసీపీ మంత్రులపై జరిగిన దాడి కేసుకు సంబంధించి అరెస్ట్ అయిన జనసేన నాయకులు, కార్యకర్తలకు కోర్టులో ఊరట లభించింది. అరెస్ట్ అయిన వారిలో 61 మందిని రూ. 10 వేల పూచీకత్తుపై కోర్టు విడుదల చేయగా, 9 మందికి మాత్రం ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది.

More Telugu News