husband: కారు ఇవ్వలేదట... ఫోన్ చేసి తలాక్ చెప్పేశాడు

husband gives triple talk to wife for not giving car
  • ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లో ఘటన
  • అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త, అత్తామామలు
  • కొన్ని రోజుల క్రితమే భార్యను పుట్టింట్లో వదిలిన భర్త
మన దేశంలో ట్రిపుల్ తలాక్ ను నిషేధించినప్పటికీ ఛాందసవాదులు ఆ దురాచారాన్ని ఇంకా పాటిస్తూనే ఉన్నారు. ట్రిపుల్ తలాక్ నుంచి ముస్లిం మహిళలను రక్షించేందుకు చట్టాలు చేసినా... దురాచారం మాత్రం ఇంకా పూర్తిగా ఆగలేదు. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఇలాంటి ఉదంతమే మరొకటి వెలుగులోకి వచ్చింది. 

కట్నంతో పాటు కారు ఇవ్వలేదనే కారణంతో భార్యకు ఫోన్ చేసి ట్రిపుల్ తలాక్ చెప్పేశాడొక ప్రబుద్ధుడు. దీంతో, బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. భర్త సహా ఐదుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

వివరాల్లోకి వెళ్తే రుబినా అనే మహిళకు ఇమ్రాన్ సైఫీ అనే వ్యక్తితో 2017లో వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల పాప ఉంది. పెళ్లి జరిగి ఏళ్లు గడుస్తున్నా భర్త, అత్తామామలు కట్నం కోసం వేధిస్తూనే ఉన్నారు. దీనిపై గత ఏడాదే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో అత్తింటి వారు రాజీ చేసుకుని ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. కొన్ని రోజుల క్రితం రాజస్థాన్ లో ఉద్యోగం అంటూ భార్యను పుట్టింట్లో వదిలి భర్త వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఫోన్ చేసి ట్రిపుల్ తలాక్ చెప్పాడు. మరోవైపు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసేందుకు సిద్దమవుతున్నారు.

More Telugu News

husband
wife
talak
Uttar Pradesh