G Jagadish Reddy: మునుగోడు ఉప ఎన్నికలో ఘన విజయం సాధిస్తాం: జగదీశ్ రెడ్డి

  • మునుగోడు ఉప ఎన్నికకు టీఆర్ఎస్ సిద్ధంగా ఉంది
  • బీజేపీకి మునుగోడు ప్రజలు బుద్ధి చెపుతారు
  • కేసీఆర్ ను ఓడించడం ఎవరి వల్ల కాదు
TRS will win in Munugode says Jagadish Reddy

మునుగోడు ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, అన్ని పార్టీలు విజయమే లక్ష్యంగా పలు వ్యూహాలను రచిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ... మునుగోడు ఉప ఎన్నికకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించబోతున్నారని జోస్యం చెప్పారు. నిత్యావసరాల ధరలు పెంచి, రైతులకు మీటర్లు పెడుతున్న బీజేపీకి బుద్ధి చెప్పేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న కేసీఆర్ ను ఓడించడం ఎవరి వల్ల కాదని చెప్పారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి దేశ ప్రజలందరూ చర్చించుకుంటున్నారని జగదీశ్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో ఉన్న పథకాలను తమకు కూడా అందించాలని ప్రధాని మోదీని అడుగుతున్నారని తెలిపారు. సరికొత్త అభివృద్ధి నమూనాతో వస్తున్న కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచడానికి దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. నిన్నటి కేసీఆర్ సమావేశాన్ని చూసిన తర్వాత మోదీ అమిత్ షాలకు నిద్రపట్టలేదని... అందుకే ఈరోజు మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల చేశారని ఎద్దేవా చేశారు.

More Telugu News