Jagga Reddy: కేసీఆర్ పెద్ద మనసుతో ఆలోచించాలి: జగ్గారెడ్డి

  • కేసీఆర్ కు వీఆర్ఏలపై కోపం సరికాదు
  • మూడు నెలలుగా జీతాలు లేక వీఆర్ఏలు బాధపడుతున్నారు
  • దసరా సందర్భంగానైనా వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలి
KCR has to solve VRAs problems demands Jagga Reddy

వీఆర్ఏలపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు కోపం తగదని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. తల్లిదండ్రులకు కోపం వచ్చినా పిల్లలను వెంటనే దగ్గరకు తీసుకుని లాలిస్తారని... అదే విధంగా రాష్ట్రానికి తండ్రిలాంటి స్థానంలో ఉన్న కేసీఆర్ కు కూడా వీఆర్ఏలపై కోపం సరికాదని చెప్పారు. గత మూడు నెలలుగా వీఆర్ఏలకు జీతాలు లేవని... వారు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారని, ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇది వారి మానసిక స్థితిని కూడా దెబ్బతీస్తోందని తెలిపారు. దసరా పండుగ సందర్భంగానైనా వారి సమస్యలను ముఖ్యమంత్రి పరిష్కరించాలని కోరారు. 

సమ్మె కాలంలో 28 మంది వీఆర్ఏలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ఇచ్చిన హామీ మేరకు పేస్కేల్ అమలు చేయాలని, పదోన్నతులు కల్పించాలని, వారసులకు ఉద్యోగాలిచ్చే జీవోలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పెద్ద మనసుతో ఆలోచించి వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరారు. వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్పారు.

More Telugu News